దృష్టి లోపాలను నివారించి కంటి చూపు సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగుకు అనూహ్య స్పందన వస్తున్నది. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఆరో రోజు శుక్రవారం 32564 మందికి పరీక్షలు చేయగా, 10267 మందికి కళ్లద్దాలను పంపిణీ చేశారు.
సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన రెండో దశ కంటి వెలుగు కార్యక్రమం గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 274 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. 6వ రోజు 32,564 మందికి కంటి పరీక్షలు జరిపినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. అందులో 10,267మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా 5,191మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారులు తెలిపారు.
నగరంలో 115 కేంద్రాల్లో కంటి పరీక్షలు నిర్వహించినట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి పేర్కొన్నారు. 6వ రోజు మొత్తం13,395మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 50,44మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీచేసినట్లు చెప్పారు. వీరిలో 40ఏండ్ల లోపు వయస్సువారు 505మంది, 40 ఏండ్ల వయస్సు పైబడిన వారు 4,407మంది ఉన్నట్లు వివరించారు. 2,149మంది రోగులకు ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
జిల్లా పరిధిలో మొత్తం 80 కేంద్రాల ద్వారా 558 ప్రాంతాల్లో కంటి వెలుగు కార్యక్రమం చేపట్టామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. 6వ రోజు జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,768 మందికి కంటి పరీక్షలు చేశామని, వారిలో 1760మంది రోగులకు రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా మరో 1505మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేశామన్నారు.
మేడ్చల్ జిల్లా పరిధిలో మొత్తం 79 కేంద్రాల ద్వారా శుక్రవారం 9,401 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ చెప్పారు. వారిలో 3,463 మంది రోగులకు రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశామని, 1537 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేసినట్లు ఆయన తెలిపారు.
మేడ్చల్ రూరల్, జనవరి 27: కంటి వెలుగు కార్యక్రమానికి జిల్లాలో ప్రజల నుంచి అపూర్వ అదరణ వస్తున్నదని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని శుక్రవారం మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు, వృద్ధులు అంధత్వ సమస్యతో బాధపడకుండా ఉండాలని దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాములు, తదితరులు పాల్గొన్నారు.