సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : నగర శివారు ప్రాంతాల్లో ప్లాట్లు, ఇండ్లు కొనుగోలు చేసిన సామాన్యుడికి రిజిస్ట్రేషన్ల శాఖ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒకవైపు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపునకు కౌంట్డౌన్ మొదలుకావడంతో కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్కు సాంకేతిక సమస్యలను సాకుగా చూపుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న కొనుగోలుదారులు.. చివరకు జిల్లా యంత్రాంగానికి మొరపెట్టుకున్న పట్టించుకునే వారు కరువయ్యారు.
ముఖ్యంగా భూముల ధరలకు ము హూర్తం ఖరారు కావడం తో గడిచిన 10 నుంచి సాంకేతిక సమస్యలు తెరమీదకు వస్తున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పెరిగిన భూముల ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం సమకూర్చుకునే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోంది. జూన్ 4 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు, స్టాంప్ డ్యూటీతోపాటు ఎల్ఆర్ఎస్ చార్జీలను బాగా పెరగనున్నాయనే సమాచారంతో కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. అయితే అదనుగా అధికారులు సర్వర్ల సమస్యలు, డేటా అప్డేషన్, సీలింగ్ భూములు, నిషేధిత భూముల పేరిట కొత్త కొత్త విధానాలను తెరమీదకు తీసుకువస్తూ రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి పడుతున్న అత్యాశతో.. ప్రజలను సర్కారు ఇబ్బందులకు గురిచేస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
శివారు ప్రాంతాల్లో..
భూముల ధరలు పెరుగుతున్న అంశంతో, కొన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చలాన్లు కట్టి, స్లాట్ బుక్ చేసుకున్న వాటికి కూడా రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నారు. దీంతో కొత్త చార్జీలకు అనుగుణంగా చార్జీలను సర్కారు వసూలు చేయించేలా ఉంది. తాజాగా మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి, ఘట్కేసర్, ఫిర్జాదిగూడ, చెంగిచర్ల, పోచారం వంటి శివారు ప్రాంతాల్లో ఈ గందరగోళం ఎక్కువగా, అదే విధంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు శివారు ప్రాంతాల్లో కనిపిస్తోంది. మేడిపల్లి మండలం పరిధిలోని పర్వతాపూర్లోని సాలార్ జంగ్ కంచె పరిధిలో సర్వే నంబర్ 1,10,11 మాత్రమే సీలింగ్ భూములుగా ఉన్నాయి. కానీ ఎలాంటి సంబంధం లేని మిగతా ప్రైవేటు సర్వే నంబర్లతో ఉన్న లే అవుట్లలోని ప్రైవేటు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కూడా అధికారులు నిలిపివేశారు. జూన్ 4 నుంచి చార్జీలు పెరుగుతున్న తరుణంలో, ప్రైవేటు భూముల రిజిస్ట్రేషన్లపై సాంకేతిక సమస్యలు పేరిట నియంత్రిస్తున్నారని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఆరోపించింది.
ఇక ఘట్ కేసర్ మండలం పరిధిలోని పోచారం గ్రామ సర్వే నంబర్ 36లో మొత్తం 218 ఎకరాల ప్రైవేటు భూమి ఉంది. ఇందులో 80 మాత్రమే ఏపీ హౌసింగ్ బోర్డు పేరిట ఉంది. మిగిలిన 138 ఎకరాల్లో చైతన్య నగర్, వివేకానందనగర్, శ్రీనివాస్ నగర్ వంటి లే అవుట్లు వెలిసి ఇప్పటికే 30శాతానికి పైగా ఇండ్లు పూర్తయ్యాయి. వాటిని కూడా ఎస్ఆర్వో యంత్రాంగం రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది. చెంగిచర్లలో ఆరు నెలలుగా ఎదురుచూపులు చూస్తున్న శ్రీరామ్ కాలనీ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై తాజాగా సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని సందర్శించి, బాధితులు వేడుకుంటే.. వచ్చే నెలలో జరిగే ధరల పెంపు తర్వాత చేస్తామంటూ తిప్పి పంపిస్తున్నారని బాధితులు వాపోయారు.
ఆదాయం కోసం ఇబ్బందులు..
పెరుగుతున్న భూముల ధరలకు అనుగుణంగా సర్కారుకు వచ్చే ఆదాయం కోసమే కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూ వివాదాలను తెరమీదకు తీసుకువస్తున్నారనే విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులు కొత్త రేట్ల ప్రకారం అదనపు స్టాంప్ డ్యూటీ, ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయవచ్చనే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అధికారుల తప్పులు, పాత రెవెన్యూ రికార్డుల్లోని నివేదికల పేరిట రిజిస్ట్రేషన్లు తొక్కి పెడుతున్నారు.
ఒకసారి రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తే.. అటు కొనుగోలుదారులు, ఇటు అమ్మకందారుల మధ్య ఆర్థికపరమైన సమస్యలను ఏమాత్రం ఆలోచన చేయకుండా అధికారులు వ్యవహార తీరు ఉంది. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, సీలింగ్, ప్రైవేటు భూములను స్పష్టంగా గుర్తించి రిజిస్ట్రేషన్లు చేయాలంటున్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి.. పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ల ఫైళ్లను పరిశీలిస్తే ఇలాంటి పుట్టగొడుగుల్లా బయటపడతాయంటున్నారు. ఇక ఇప్పటివరకు సాంకేతిక సమస్యలతో వాయిదా వేసిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు పాత రేట్ల ప్రకారమే స్టాంప్ డ్యూటీ తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని, లేదంటే కొత్త ధరలకు కటాప్ తేదీలను నిర్ధారించాలని సామాన్యులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు డిమాండ్ చేస్తున్నారు.