మేడ్చల్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించి..విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ను తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ నేటి నుంచి వచ్చే నెల జనవరి 10 వరకు బడి బయట పిల్లల గుర్తింపు సర్వేను నిర్వహించనున్నది. ‘బడీడు పిల్లలంతా బడిలోనే ఉండి చదువుకోవాలి’ అనే లక్ష్యంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. స్కూళ్లకు రాని లేదా బడిలో చేరని పిల్లలను గుర్తించి.. వారిని పాఠశాలలో చేర్పించడమే ఈ సర్వే లక్ష్యం. బడీడు పిల్లలను గుర్తించి.. వయసుకు తగ్గ తరగతిలో చేర్చుకున్నాక..వారికి అభ్యాసన సామర్థ్యాలు వచ్చే వరకు శిక్షణ ఇస్తారు.
సోమవారం నుంచి ప్రారంభమయ్యే సర్వేలో క్షేత్రస్థాయిలో ఆవాస ప్రాంతాల్లో ఇంటింటా తిరిగి బడి బయట పిల్లల వివరాలను సేకరించనున్నారు. ఎలిమెంటరీ విభాగంలో 6 నుంచి 14 ఏండ్లలోపు బడి పిల్లలను.. సెకండరీ స్థాయిలో 15 నుంచి 19 ఏండ్లలోపు వారిని వేర్వేరుగా గుర్తించి జాబితాను రూపొందించనున్నారు. ఆ జాబితాలోని వివరాలను ఎప్పటికప్పుడు జాతీయ స్థాయిలోని ప్రభంద్ పోర్టల్లో నమోదు చేయనున్నారు. ఈ సర్వేను పకడ్బందీగా నిర్వహించేలా రాష్ట్ర విద్యాశాఖ సమగ్ర శిక్ష ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డీఈవో విజయకుమారి తెలిపారు.