సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీ లక్ష్యంగా బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందుగానే సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడం.. అభ్యర్థిత్వం ఖరారైన మరుసటి రోజు నుంచే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ గెలుపు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలో డివిజన్ల వారీగా పాదయాత్రలు, ర్యాలీలు, కాలనీ, అసోసియేషన్ సంఘాల సమావేశాలతో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజలతో మమేకమై ప్రచారంలో జోరు పెంచగా, ప్రత్యర్థి పార్టీల్లో మాత్రం నేటికి అయోమయ పరిస్థితి నెలకొంది. వర్గపోరు, కుమ్ములాటలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో గందరగోళం నెలకొనగా, కొన్ని నియోజకవర్గాల్లో కనీసం అభ్యర్థులు కూడా దొరక్క ఆ రెండు పార్టీల్లో నిరాశ ఆవరించింది.
ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ..సమస్యలను అడిగి తెలుసుకుంటూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే సమస్యలకు తక్షణ పరిష్కారంతో పాటు అపరిషృత సమస్యలను కొలిక్కి తీసుకువస్తున్నారు. దీంతో వాడవాడలా, కాలనీలు బ్రహ్మరథం పడుతున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల ఆధారంగానే ప్రచార పర్వం సాగిస్తున్నారు. తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే అస్ర్తాలుగా సాగుతూ లబ్ధిదారులు, వారీ కుటుంబాలను ఓటు బ్యాంకుగా మలచుకోవడంలో సఫలీకృతులవుతున్నారు.
గ్రేటర్ చరిత్రలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఆదర్శంగా నిలిచింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఫించన్తో‘ఆసరా’గా నిలిచింది. అడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్తో చేయూతనందించింది. రైతుబంధు, రైతుబీమాతో ఆన్నదాతకు ఆత్మబంధువై నిలిచింది. మాతా శిశు సంరక్షణకు కేసీఆర్ కిట్లను ప్రవేశపెట్టింది. యాదవులకు గొర్రెల పంపిణీ, రజకులకు, మత్స్యకారులకు, నాయీ బ్రహ్మణులకు, ఇలా సబ్బండ వర్ణాలకు బాసటగా నిలిచింది. ఏ రకంగా చూసుకున్న ప్రతి కుటుంబానికి ఒకటి నుంచి రెండు పథకాలు వర్తించాయి. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా అటు అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో, ఇటు అభ్యర్థుల క్యాంపు కార్యాలయాలు, ఇంటి వద్దకు వచ్చిన లబ్ధిదారులు నిండు మనస్సుతో దీవిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నామంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఆశీర్వదిస్తున్నారు. ఆర్థిక సోమతలేక బడుగు బలహీన వర్గాల సమున్నత అభివృద్ధి కోసం, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృతనిశ్చయంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకుసాగుతున్న తీరుపై వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థులకు వస్తున్న ఈ అపూర్వ స్పందనను చూస్తే భారీ మెజార్జీతో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అభ్యర్థిత్వం ఖరారైన మరుసటి రోజు నుంచే ఎమ్మెల్యేలు స్పీడ్ పెంచారు. బూత్ లెవల్ వారీగా సమావేశాలు , కాలనీ, సంక్షేమ సంఘం నాయకులతో మీటింగ్లతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని ప్రోత్సహిస్తూ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నారు. సంక్షేమం, అభివృద్ధి పథకాలకు ఆకర్షిలవుతూ కొందరు, స్థిరమైన నాయకత్వంతో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఒక పక్క చేరికలు, మరో పక్క లబ్ధిదారులతో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. గృహలక్ష్మి, డబుల్ బెడ్ర్రూం ఇండ్లు, బీసీ బంధు, మైనార్టీ బంధు, పింఛన్లు ఇలా సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ఉదయం, సాయంత్రం ఎమ్మెల్యేల కార్యాలయాలు కిక్కిరిసిపోయి కనబడుతున్నాయి.