మేడ్చల్, అక్టోబర్ 27 : మేడ్చల్ నియోజకవర్గంలో ప్రచారంలో కారు దూసుకెళ్తున్నది. రోజు రోజుకు వేగం పెంచుతూ ప్రతిపక్ష పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు ప్రచారం..మరో వైపు చేరికలతో హోరెత్తిస్తోంది. శుక్రవారం మేడ్చల్ పట్టణం, శామీర్పేట మండలం లాల్గడీమలక్పేట, నాగారం మున్సిపాలిటీలో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన 300 మంది నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు బీఆర్ఎస్లో చేరారు.
మేడ్చల్ పట్టణంలోని 17,18వ వార్డులకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ నేత రామన్నగారి రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో చేరికల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మహిళలతో కలిసి నేలపై కూర్చొని, జై బీఆర్ఎస్, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఆప్యాయంగా పలకరిస్తూ బీఆర్ఎస్ను గెలిపించాలని, పార్టీలోకి చేరిన వారికి స్వాగతం పలికారు. ఓ వృద్ధురాలిని తన ఒడిలో కూర్చొపెట్టుకొని, విజయ సంకేతాన్ని చూపారు.
అనంతరం చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహా రెడ్డి, రాఘవేందర్ గౌడ్తో కలిసి బీఆర్ఎస్లో చేరిన మహిళలు, యువకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే లాల్గడీమలక్పేటలో సర్పంచ్ వనజాశ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బీఎస్పీ నుంచి 15 మంది, నాగారం మున్సిపాలిటీలో పార్టీ అధ్యక్షుడు శ్రీధర్, చైర్మన్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు.