సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే భక్షకుడిగా మారాడు. ఏకంగా ఒక విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో చోరీకి పక్కా స్కెచ్ వేశాడు. కాని ఎంత పోలీసు అయినా అతడి ఆటలు సాగలేదు. ఆ పోలీసు అధికారి వేసిన ప్లాన్ను పోలీసులే చిత్తు చేశారు. విషయాన్ని ముందుగానే పసిగట్టిన సదరు పోలీసు అధికారి వారం రోజులుగా విధులకు హాజరు కాకుండా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో సదరు ఎస్ఐని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా చోరీ కేసులో ప్రధాన సూత్రదారిగా అనుమానిస్తున్న ఎస్ఐని అరెస్టు చేసేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేశారు.
ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్లో నివాసముంటున్న ఐఆర్ఎస్ అధికారి సామ్యూల్ ప్రసాద్కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. వీరంతా యూఎస్లో స్థిరపడ్డారు. సామ్యూల్ భార్య ఇటీవలే మృతిచెందడంతో ప్రస్తుతం సామ్యూల్ప్రసాద్ ఒంటరిగానే ఉంటున్నాడు. నగరంలోనే ఉన్న సామ్యూల్ బంధువులు అప్పుడప్పుడు వచ్చి ఆయన బాగోగులు చూసుకుంటారు. సామ్యూల్కు నగరంతో పాటు వికారాబాద్, చేవెళ్ళ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి. అయితే తన వద్ద ఉన్న కొంత భూమిని విక్రయించేందుకు రియల్టర్ సురేందర్ సహాయం తీసుకున్నాడు. ఈ క్రమంలో 2020లో వికారాబాద్, మద్దూరులో ఉన్న 8ఎకరాల భూమిలో నుంచి 5ఎకరాలను సురేందర్ ద్వారా ప్రస్తుతం దుండిగల్ డిటెక్టివ్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ క్రమంలో సామ్యూల్ ప్రసాద్కు కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయని, అతడికి వెనకా ముందు ఎవరూ లేరని సురేందర్ ద్వారా తెలుసుకున్న డీఎస్ఐ ఎలాగైనా సామ్యూల్ ఆస్తిని కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం సామ్యూల్కు నమ్మకస్తుడైన సురేందర్ సాయం తీసుకొని, సామ్యూల్ ఆస్తి పత్రాలు, నగదు చోరీకి పక్కా స్కెచ్ వేశాడు.
దుండిగల్ డీఎస్ఐ కృష్ణ సూచన మేరకు సురేందర్ గతనెల 30న మత్తు మందు కలిపిన ఇడ్లీలను సామ్యూల్కు ఇచ్చాడు. అవి తిన్న సామ్యూల్ మత్తులోకి జారుకోగానే అతడి ఇంట్లో ఉన్న కోట్ల విలువైన భూముల పత్రాలు, రూ.5లక్షల విలువైన బంగారం, వెండి నగలు, నగదును సురేందర్ తస్కరించి అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ మేరకు బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించిన ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో చోరీకి పాల్పడింది అతడికి సన్నిహితంగా ఉండే రియల్టర్ సురేందర్ అని తేలింది.
పోలీసులు సురేందర్ను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీకి స్కెచ్ వేసింది దుండిగల్ డిటెక్టివ్ ఎస్ఐ కృష్ణ అని, చోరీ చేసిన భూమి పత్రాలు అతడికే అప్పగించినట్లు వెల్లడించాడు. సురేందర్ ఇచ్చిన సమాచారంతో పాటు సీసీ కెమెరాలు, దుండిగల్ ఎస్ఐ కృష్ణ ఫోన్ కాల్ డాటాను పరిశీలించగా ఎస్ఐ బాగోతం బయట పడింది. దీంతో ముషీరాబాద్ పోలీసులు దుండిగల్ డీఎస్ఐ ఇంట్లో తనిఖీ చేయగా అతడి కారులో భూములకు సంబంధించిన పత్రాలు లభించినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల తనిఖీలు, విచారణతో జరుగబోయే పరిణామాన్ని ఊహించిన దుండిగల్ డీఎస్ఐ ఈనెల 20నుంచి పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా గత వారం రోజులుగా విధులకు కూడా గైర్హాజరు అవుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో చోరీ కేసులో సూత్రదారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దుండిగల్ డిటెక్టివ్ ఎస్ఐ కృష్ణపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తున్నది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా మాత్రం పోలీసు అధికారులు ప్రకటించలేదు.
చోరీ కేసులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్ఐ కృష్ణను అరెస్టు చేసేందుకు ముషీరాబాద్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి సామ్యూల్ ప్రసాద్ ఇంట్లో చోరీకి గురైన పత్రాలు దుండిగల్ ఎస్ఐ కృష్ణ కారులో లభించడం, చోరీకి పాల్పడిన సురేందర్ పోలీసు విచారణలో ఎస్ఐ సూచన మేరకే చోరీకి పాల్పడినట్లు వెల్లడించడంతో పాటు ఇరువురి ఫోన్కాల్స్, సీసీ కెమెరాల ఫుటేజి తదితర పక్కా ఆధారాలు లభించారు. దీంతో డీఎస్ఐ కృష్ణను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది.