సిటీబ్యూరో: మూసీ సుందరీకరణ పేరిట తమ ఇండ్లు కూల్చి రోడ్డున పడేయొద్దని పరీవాహక ప్రజలు వేడుకుంటున్నా ప్రభుత్వం మొండి వైఖరి వీడటం లేదు. పైసాపైసా కూడబెట్టుకుని కట్టుకున్న ఇండ్లు, కొనుక్కున్న స్థలాలను అన్యాయంగా లాక్కోవద్దని నిరసనలు, ధర్నాలు చేసినా పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటూ పోతున్నది. ప్రజల బాధలేవీ పట్టించుకోకుండా మూసీ ప్రాజెక్టు తొలిదశను రూ.735.12 కోట్లతో 21 కిలోమీటర్ల మేర పనులు ప్రారంభించేందుకు గురువారం తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రజల వినతులు, నిరసనలు, ఆందోళనలు, అభ్యర్థనలు మూసీలో పడేసింది. మూసీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు తమ కష్టార్జితాన్ని లాక్కోవద్దని వేడుకున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ధర్నాలు, నిరసనలు చేశారు. అయినా వారు చేసిన పోరాటాలు, వినతులను ఏమాత్రం లెక్క చేయలేదు. తొలి దశలో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరిట హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ దాకా భూసేకరణ చేయనుంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసి.. గ్రామసభలు నిర్వహించింది. ఇక కేబినెట్ నిర్ణయంతో పనులను వేగవంతం చేయనున్నది.