సిటీబ్యూరో/ శంషాబాద్ రూరల్, మే 13 (నమస్తే తెలంగాణ): పదేండ్లుగా నకిలీ నోట్లు తయారు చేస్తూ వివిధ రాష్ర్టాలకు సరఫరా చేసి అమాయకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా శంషాబాద్ ఎస్వోటీకి చిక్కింది. నిందితుల వద్ద నుంచి రూ.8,55,000 విలువైన నకిలీ రూ.500, రూ.200, రూ.100, రూ.50 నోట్లు సహా వాటి తయారీకి వినియోగించే రూ.11 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శనివారం శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ నారాయణరెడ్డి, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, శంషాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీధర్లతో కలిసి వివరాలు వెల్లడించారు. ఏపీలోని ఆనకాపల్లి జిల్లాకు చెందిన రంజిత్సింగ్, మోహన్రావు సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్లు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో నకిలీ నోట్లు తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. 2013లో నకిలీ నోట్లు తయారు చేస్తూ.. పోలీసులకు పట్టుపడ్డారు. వీరిపై మూడు కేసులు నమోదయ్యాయి.
నిందితులు అనేకసార్లు పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లినా తీరు మారలేదు. తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలకు సైతం నకిలీ నోట్లను సరఫరా చేస్తున్నారు. కొంత మంది ఏజెంట్లు వీరిని టెలీగ్రామ్, ఇన్స్టాగ్రామ్ల ద్వారా సంప్రదిస్తారు. వారు రూ.2 లక్షల ఒరిజినల్ నోట్లు ఇస్తే రూ.6 లక్షల నకిలీ నోట్లను నిందితులు అందజేస్తారు. అంటే 1:3 నిష్పత్తిలో నకిలీ నోట్లను అవసరమైన ఏజెంట్లకు విక్రయిస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా అచ్చం ఒరిజినల్ నోట్లలాగానే నకిలీ నోట్లను ముద్రించడంలో నిందితులు నిష్ణాతులు. నకిలీ నోట్ల ముద్రణ కోసం నిందితులు ఫొటోషాప్ సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ తరువాత ఒరిజినల్ నోట్లను స్కానర్తో స్కాన్ చేసి, ఎక్స్ఎల్ బాండ్ పేపర్లపై కలర్ ప్రింటర్ సహాయంతో ప్రింట్ తీస్తారు. ఈ విధంగా ముద్రించిన నోట్లను కొంత సేపు ఆరబెట్టి ఆ తరువాత ఏజెంట్లకు సరఫరా చేస్తారు. నకిలీ నోట్లు తయారు చేసి.. నగరంలోని ఏజెంట్లకు సరఫరా చేసేందుకు రెండ్రోజుల కిందట ఇక్కడకు వచ్చిన నిందితులు.. తొండుపల్లిలోని ఓ హోటల్లో బస చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు, స్థానిక పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ వెల్లడించారు.