సిటీబ్యూరో, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ)/దుండిగల్: పర్యావరణ హితమే లక్ష్యంగా ఆరు సంవత్సరాలుగా హెచ్ఎండీఏ తన వంతు బాధ్యతగా గణేశ్ మట్టి ప్రతిమలను ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నది. ప్రతి యేటా మాదిరిగానే ఈ సారి లక్ష మట్టి విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గురువారం ప్రగతిభవన్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికాసంఘం వైస్ చైర్మన్ బి.వినోద్కుమార్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ డాక్టర్ బి. ప్రభాకర్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ పరంజ్యోతి పాల్గొన్నారు. అనంతరం సచివాలయంలో అర్వింద్కుమార్ ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి వినాయక మట్టి ప్రతిమలను అందజేశారు. గురువారం నుంచి 17వ తేదీ వరకు 40 కేంద్రాల్లో హెచ్ఎండీఏ వినాయక మట్టి ప్రతిమలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మట్టి గణపతులను పూజిద్దాం..
సికింద్రాబాద్, సెప్టెంబర్ 14: మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి దంపతులు అన్నారు. అలాగే, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తోడ్పాటు అందించాలని మండప నిర్వాహకులకు సూచించారు. తార్నాకలోని తమ క్యాంపు కార్యాలయం వద్ద గురువారం మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జీహెచ్ఎంసీ పరిధిలో మట్టి గణపతులను పూజించాలని, బల్దియా ఆధ్వర్యంలో ప్రతి జోన్లో ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన వినాయక విగ్రహాలు వద్దని, జల కాలుష్యం పెరిగి పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వార్డుకు 2500 మట్టి ప్రతిమలు పంపిణీ
సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు జీహెచ్ఎంసీ పరిధిలో గురువారం నుంచి 17వ తేదీ వరకు వార్డుల వారీగా మట్టి గణేశ్ విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు కమిషనర్ రోనాల్డ్రోస్ తెలిపారు. వార్డుకు 2,500ల చొప్పున ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రతి సర్కిల్కు ఒక ఏఎంఓహెచ్ను ఇన్చార్జిగా, ప్రతి వార్డుకు వార్డు ఆఫీసర్ను ఇన్చార్జిగా నియమించామని కమిషనర్ పేర్కొన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ 1.5 ఫీట్ల మట్టి విగ్రహాలు 10వేలు, 1 ఫీట్ 30 వేలు, 8 ఇంచుల విగ్రహాలు 2లక్షల 70 వేల విగ్రహాలు , హెచ్ఎండీఏ, పీసీబీల ద్వారా కలుపుకొని 4.64 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తామని కమిషనర్ తెలిపారు.