Hyderabad | సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ): నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ రద్దీగా ఉంటుంది.. ఈ రద్దీలో ఒకరికొకరు తగులుతూ కొన్ని సందర్భాల్లో ముందుకెళ్తుంటారు.. అలా శంకరయ్య (పేరు మార్చాం..) ముందుకెళ్తూ తననెవరూ చూడడం లేదనుకొని ముందున్న మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు.. రద్దీలో బాధితులు వెనక్కిచూసే లోపు శంకరయ్య.. బిత్తిరి చూపులతో తనకేమి తెలియనట్లు ప్రవర్తిస్తున్నాడు. ఇంతలో అక్కడున్న షీ టీమ్స్ అతన్ని పట్టుకొని స్టేషన్కు తరలించారు. తనకేమి తెలియదంటూ అమాయకంగా ప్రవర్తించాడు. అయితే మీ భార్యను తీసుకొని రేపు కౌన్సెలింగ్కు రావాలని షీ టీమ్స్ సిబ్బంది సూచించారు. దీంతో మరుసటి రోజు భార్యతో వచ్చిన శంకరయ్య చేష్టలను వీడియోలో చూసిన భార్య అతడి చెంప చెల్లు మనిపించింది. ఇలా షీ టీమ్స్కు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతున్న వారి చేష్టలను చూసి చాలా మంది కుటుంబ సభ్యులు నిశ్చేష్టులవుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులకు, పెద్దవాైళ్లెతే భార్యలకు తమ నిజ స్వరూపం తెలిసిపోతుండడంతో చేసేది లేక మన్నించాలంటూ వేడుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయి.
బస్స్టాప్లు, రద్దీగా ఉండే ప్రాంతాలలో షీ టీమ్స్ పోకిరీలను పట్టుకోవడం కోసం ఈ ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నిందితుల చేష్టలను వీడియోలు తీస్తుంది. పూర్తి సాక్ష్యాలు చేతికందిన వెంటనే ఆయా పోకిరీలను అదుపులోకి తీసుకొని షీ టీమ్స్కు తరలిస్తుంటారు. ఆ తరువాత వారు చేసిన తప్పులను బట్టి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. పైండ్లెన వారైతే వారి భార్యలను కౌన్సెలింగ్కు పిలిపిస్తున్నారు. తన భర్త మంచివాడని, ఎలాంటి తప్పు చేయడంటూ షీ టీమ్స్ ముందు వాదిస్తుంటారు. అయితే కౌన్సెలింగ్ చేసే వారు ఒక్కసారి ఈ వీడియో చూడండంటూ వారి భార్యలకు చూపిస్తున్నారు. దీంతో ఆ వీడియోలను చూసిన సదరు భార్య శివంగిలా మారి, కొందరు భర్తల చెంపలు చెల్లుమన్పిస్తున్నారు. అలాగే పెండ్లి కాని యువత, మైనర్ పిల్లల విషయంలోనూ తల్లిదండ్రులను పిలిచి వీడియోలు చూపిస్తున్నారు. అయితే ఈ కౌన్సెలింగ్తో పోకిరీల మైండ్సెట్ మారుస్తున్నామని నగర మహిళా భద్రత డీసీపీ కవిత తెలిపారు.