మణికొండ, ఫిబ్రవరి 5 : విలువైన గ్రామకంఠం భూమిని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారంటూ ఈనెల 3న ‘నమస్తే తెలంగాణ’లో ‘గ్రామకంఠానికి ఎసరు’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి గండిపేట రెవెన్యూ అధికారులు స్పందించారు. గురువారం రెవెన్యూ ఇన్స్పెక్టర్లు సురేశ్, సుజిత్ల నేతృత్వంలో ఆక్రమణకు గురైన పిత్రికుంటను పరిశీలించారు. రెవెన్యూ రికార్డు ప్రకారం ఆ భూమి ఎకరం వరకు ఉంటుందని దానిని ఆక్రమించుకునేందుకు రాత్రిపూట మట్టికుప్పలతో నింపుతున్న వైనాన్ని గుర్తించారు. ఇదే విషయమై గ్రామస్తులతో అధికారులు మాట్లాడారు. ఇది గ్రామకంఠానికి చెందిన భూమియేనా అని ప్రశ్నించగా పూర్వకాలం నుంచి ఇది గ్రామ కంఠానికి చెందిన భూమి అని గ్రామస్తులు తెలిపారు.
ఎకరం భూమిని కొంతమంది స్థానిక కాంగ్రెస్ నేతలు,మాజీ ప్రజాప్రతినిధులు కలిసి అప్పటి గ్రామ సర్పంచ్ ఈ భూమిని తమకు కట్టబెట్టారంటూ పత్రాలను సృష్టించి కొంతమంది నాయకులు రాత్రి, పగలు అన్నతేడా లేకుండా పిత్రికుంటలో మట్టి పోస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన జీహెచ్ఎంసీ అధికారులకు ఏమాత్రం పట్టింపులేకుండా వ్యవహరించడంతోనే మట్టి పోసేశారని మంచిరేవుల గ్రామస్తులు మండిపడ్డారు. ‘నమస్తే’ కథనం ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై గండిపేట రెవెన్యూ అధికారులు స్పందించిన తీరుపై మంచిరేవుల వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులు పిత్రికుంట చుట్టూ ప్రీకాస్ట్ గోడలను నిర్మించి ఈ భూమి ప్రభుత్వానికి చెందినదిగా బోర్డులను అమర్చారు.
భూమి రాసిచ్చే హక్కు ఎవరికీ ఉండదు
-శ్రీనివాస్రెడ్డి, గండిపేట తహసీల్దార్
గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని మంచిరేవుల గ్రామ పరిధిలోని ఎకరం గ్రామకంఠానికి చెందిన భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ గ్రామస్తులు తెలుపుతున్నారు. పాత సర్పంచ్ల సంతకాలతో కూడిన పత్రాలను చూపి ఆక్రమించి ఇండ్లు నిర్మించాలని యత్నిస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకుని ఎకరం భూమిని కాపాడాం. గ్రామకంఠానికి చెందిన భూములను కేటాయించేందుకు సర్పంచ్లకు ఎలాంటి హక్కులు ఉండవు. నిజంగా అలాంటి పత్రాలు ఉంటే తక్షణమే అప్పటి సర్పంచ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశాలున్నాయి. ఆక్రమణలు చేయాలని చూస్తే వారిపైనా కేసులు నమోదు చేస్తాం.