సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ‘అభయ హస్తం’ కింద ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులన్నింటికీ పక్కాగా జీహెచ్ఎంసీ డేటా ఎంట్రీ చేపడుతున్నది. 30 సర్కిళ్ల పరిధిలో 24,74,325 దరఖాస్తులు రాగా.. ఇందులో అభయహస్తం కింద 19,01,256, ఇతర దరఖాస్తులు 5,73,069 లను స్వీకరించారు. ఈ దరఖాస్తులన్నింటినీ ఆన్లైన్లోకి చేర్చాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం సెలవు దినం అయినప్పటికీ 3500 మంది ఆపరేటర్లతో దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మొదలు పెట్టారు.
ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీలోని 5 జోన్లకు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పర్యవేక్షణాధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ నెల 17వ తేదీలోగా పూర్తి చేయాలని సంబంధిత కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. కాగా అభయహస్తం కింద వచ్చిన దరఖాస్తులను మాత్రమే డేటా ఎంట్రీ చేపడుతున్నారు. రేషన్ కార్డు, ఇతర సమస్యలపై వచ్చిన దరఖాస్తులను ఎంట్రీ చేయడం లేదు. వీటిపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. పండుగ సెలవుల కారణంగా గడువులోగా దరఖాస్తుల ఎంట్రీ పూర్తవుతుందో.. లేదో? అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇక అర్హుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి మార్గదర్శకాలను విడుదల చేయకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది.