కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 10 : తొమ్మిదిన్నరేండ్ల కాలంలో కూకట్పల్లి నియోజకవర్గంలో రూ.9వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశానని.. మరోసారి ఆశ్వీరదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్పల్లి డివిజన్లోని మైత్రీనగర్, ఏవీబీపురం, దయార్గూడ లలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో నియోజకవర్గంలో రూ.9వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశానన్నారు.
ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ఫ్లైఓవర్ అండర్పాస్ బ్రిడ్జిలు, రిజర్వాయర్లతో తాగునీటి కష్టాలు తీర్చినట్లు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించానని, కాలనీలు, బస్తీల రూపురేఖలే మార్చినట్లు తెలిపారు. ప్రాంతాలు, మతాలకతీతంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవ చేసినట్లు తెలిపారు. మరోవైపు దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో కల్యాణలక్షీ, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, దళితబంధు, బీసీబంధు లాంటి పథకాలు అమలవుతున్నాయన్నారు. పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని గల్లీగల్లీలో అభివృద్ధి జరిగిందన్నారు.
కూకట్పల్లిలో పుట్టిపెరిగానని.. మీరందించిన దీవెనలతో ఎమ్మెల్యేగా పదేండ్లు ప్రజలకు సేవచేశానని మరోసారి ఆశీర్వదిస్తే కూకట్పల్లిని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. కూకట్పల్లిలో పురాతన కాలంనాటి రామాలయం, చిత్తారమ్మ దేవాలయాలలు అభివృద్ధి చేశానని, మసీదులు, చర్చీల అభివృద్ధి కోసం కృషి చేసినట్లు తెలిపారు. విజ్ఞతతో ఆలోచించి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ నేతలున్నారు.