బంజారాహిల్స్, ఫిబ్రవరి 14: అదృశ్యమైన బాలుడు నాలాలో శవమై కనిపించాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం మునావత్ తండాకు చెందిన మునావత్ రమేశ్ డ్రైవర్గా పనిచేస్తూ జూబ్లీహిల్స్ రోడ్ నం. 5లోని దుర్గాభవానీనగర్ బస్తీలో ఉంటున్నాడు. అతడికి భార్య కవితతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. చిన్న కొడుకు మునావత్ కార్తిక్(10) మంగళవారం రాత్రి ఇంట్లోంచి ఆడుకునేందుకు బయటకు వెళ్లి.. తిరిగి రాలేదు. అన్ని చోట్ల్ల వెతికినా.. ప్రయోజనం లేకపోవడంతో అర్ధరాత్రి తల్లి కవిత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు సమీప ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలో పోలీసులు బుధవారం బస్తీకి సమీపంలో నిరుపయోగంగా ఉన్న జీహెచ్ఎంసీ పార్కు స్థలంలోని నాలాలో కార్తిక్ మృతదేహాన్ని గుర్తించారు. జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్రెడ్డి క్లూస్ టీమ్స్తో ఘటనా స్థలికి వచ్చి ఆధారాలు సేకరించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.