బంజారాహిల్స్,ఏప్రిల్ 10 : అల్లుడి ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను మద్యం మత్తులో దగ్ధం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జగద్గిరిగుట్టకు చెందిన ఎలక్ట్రీషియన్ ఎం. పాండు (25) అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం తన స్నేహితుడు శ్రీనివాస్ను కలిసేందుకు ఫస్ట్ బెటాలియన్ వద్దకు వచ్చాడు. ఇద్దరు కలిసి మద్యం సేవించి ఆలస్యం కావడంతో శ్రీనివాస్ ఇంటివద్దే నిద్రపోయాడు.
అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ మామ నాగయ్య మద్యం మత్తులో రాత్రి అక్కడకు చేరుకున్నాడు. తన అల్లుడిమీద కోపంతో ఇంటిముందు ఉన్న యూనికార్న్ బైక్(టీఎస్ 08 హచ్ఎస్ 0624)పెట్రోల్ పోసి కాల్చేశాడు. దాంతో లోపలినుంచి వచ్చిన పాండు చూడగా మంట్లో కాలిపోతున్న బైక్ కనిపించింది. దీంతో బైక్ను కాల్చేసిన నాగయ్యపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.