వనస్థలిపురం, సెప్టెంబర్ 1 : పనిచేస్తుండగా భవనంపై నుంచి జారిపడి ఓ కూలీ మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతుడి బంధువుల వివరాల ప్రకారం. నాగర్కర్నూల్ జిల్లా అనంతవరం గ్రామానికి చెందిన తీర్లపురం కృష్ణయ్య(45) పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. వనస్థలిపురం నాగార్జున కాలనీలో నివాసముంటూ కూలీ పని చేసుకుంటున్నాడు.
బుధవారం వైదేహినగర్కు చెందిన బకారాం నూతన భవనం వద్దకు పనికి వెళ్లాడు. బయట నుంచి కట్టి ఉన్న గోవ కట్టెలు విప్పుతుండగా జారి కిందపడిపోయాడు. వెంటనే ఏరియా దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని బంధువులు డిమాండ్ చేస్తూ భవనం వద్ద బైఠాయించారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.