మేడ్చల్, జూలై 2: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతుంది. ఏండ్లుగా పడుతున్న కష్టాలకు గట్టెక్కే సమయం ఆసన్నమైంది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ గుండ్లపోచంపల్లి-కొంపల్లి దారిలో ఉన్న నారాయణచెరువు అలుగు పలు కాలనీలకు ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. వర్షాలు పెద్ద ఎత్తున కురిసిన ప్రతిసారి కాలనీలు నీట మునిగి, కొన్ని రోజుల వరకు ఇండ్లు విడిచిపెట్టాల్సిన పరిస్థితి. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలోని మున్సిపాలిటీ పాలకవర్గం శాశ్వత పరిష్కారానికి పూనుకుంది. అలుగు నీటిని నేరుగా గుండ్ల చెరువుకు మళ్లించేందుకు రూ.కోటి నిధులను కేటాయించింది. నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించి, ప్రణాళిక రూపొందించారు. ఆరు నెలల కిందట కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పనులను ప్రారంభించారు. పనుల పూర్తి అడుగు దూరంలో ఉంది.
నాలుగైదేండ్లుగా…
మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబరు 130లో 11 ఎకరాల 4 గుంటల్లో నారాయణ చెరువు విస్తరించి ఉంది. గతంలో చెరువు చుట్టు పక్కల ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఖాళీగా ఉండటంతో చెరువు నిండినప్పుడు నీరు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. కానీ కాలక్రమేణా నగర సరిహద్దుల్లో ఉన్న గుండ్లపోచంపల్లి విస్తరించింది. భారీగా చుట్టు పక్కల నిర్మాణాలు వెలిశాయి. దీంతో నీరు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చెరువు పై భాగంగా ఉన్న అర్కెల్గూడ, ప్రెస్టేజ్ పార్కు ప్రాంతంలో లేఔట్లు కావడంతో డ్రైనేజీ, వరద నీరు నారాయణ చెరువులో కలిసేలా పైపులైన్లు ఏర్పాటు చేశారు. ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు పై నుంచి వచ్చే నీటితో నాలుగైదేండ్ల నుంచి నారాయణ చెరువు నిండుతుంది. చెరువు నిండితే నీరు బయటకు వెళ్లేందుకు అవకాశం లేక మాణిక్యరెడ్డి నగర్, లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న గృహాల్లోకి నీరు చేరుతున్నాయి. ఒక్కసారి కాలనీలోకి నీరు చేరాయంటే 10 నుంచి 15 రోజుల వరకు ప్రజలకు ఇబ్బందులు తప్పేవి కావు. అలాగే నీరు తారు రోడ్డుపై నుంచి వెళ్తుంటాయి. దీంతో ఆ రోడ్డుపై నుంచి ప్రయాణించే స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల వారికి ఇబ్బందులు తతెత్తుతున్నాయి. ఆ సమయంలో తాత్కాలికంగా జేసీబీతో కాల్వను తవ్వి ఖాళీ ప్లాట్ల నుంచి తరలించాల్సి వచ్చేది.
70 శాతం పనులు పూర్తి
నారాయణ చెరువు అలుగు నీటి మళ్లించేందుకు రూ.కోటి వ్యయంతో చేపట్టిన పనులు దాదాపు 70 పూర్తయ్యాయి. అలుగు నుంచి ఏజీ వెంచర్ మీదుగా గుండ్లచెరువుకు నీటిని మళ్లించేందుకు పైపులైన్ నిర్మిస్తున్నారు. పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఊర్జిత వెంచర్ ప్రహరీ వరకు పైపులైన్ నిర్మాణం పూర్తయింది. అక్కడి నుంచి గుండ్లపోచంపల్లి చెరువుకు నీటిని మళ్లించే పనులు పురోగతిలో ఉన్నాయి. దాదాపు నెలల రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి. పనులు పూర్తి కాగానే అలుగు పారే నీటిని గుండ్లచెరువులోకి మళ్లిస్తారు. ఇప్పుడిప్పుడే వర్షాలు ప్రారంభమయ్యాయి. భారీగా వర్షం కురిసినా చెరువు నిండి అలుగు పారడానికి దాదాపు నెల రోజులు పడుతుంది. ఆ లోగా పనులు పూర్తవుతాయి. ప్రజల సమస్యను ఎదుర్కొనే పరిస్థితి రాదు.
ప్రధాన సమస్యకు పరిష్కారం
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి నారాయణ చెరువు అలుగు సమస్య ప్రధాన సమస్యగా మారింది. వర్షాకాలం వచ్చిదంటే పలు వార్డులకు చెందిన కాలనీల్లోని వీధులు, ఇండ్లలోకి నీరు వచ్చి చేరేది. ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత నాలుగైదేండ్లుగా క్రమం తప్పకుండా వర్షాలు జోరుగా కురుస్తుండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. అలుగు సమస్యను తీవ్రంగా పరిగణించి, శాశ్వత పరిష్కారానికి రూ.కోటి నిధులను కేటాయించాం. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో కాల్వ నిర్మాణ ప్రణాళికపై చర్చించి, నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. త్వరలో పనులు పూర్తయి, ప్రజల ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
-మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, చైర్పర్సన్, గుండ్లపోచంపల్లి