హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ)/కవాడిగూడ: మణిపూర్ అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర దాగి ఉన్నదని వామపక్షాల నేతలు విమర్శించారు. మణిపూర్ అలర్లను అరికట్టి, ప్రజల ప్రాణాలను కాపాడాలని, ఆ రాష్ట్ర సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. లోయర్ ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. మణిపూర్ రావణకాష్టంగా మారినా ప్రధాని మోదీ స్పందించకపోవడం అత్యంత దారుణమని ఆరోపించారు. మత ఘర్షణలతో రాజకీయ లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్న బీజేపీని కేంద్రం నుంచి గద్దె దించాలని, అందుకు ప్రజాస్వామ్య, లౌకకవాద శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు అజీజ్ పాషా, ఈటీ నరసింహ, ఛాయాదేవి, బీ వెంకటేశం, ధర్మేంద్ర, డీజీ నరసింహరావు, మల్లు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.