మాదాపూర్, నవంబర్ 18 : సాధారణంగా వైద్యులకు వారం లేదా నెలలో ఒక చాలెంజ్ కేసులు వంటివి వస్తుంటాయని, ఎన్ఐసీయూలో వైద్యులకు రోజుకు ఒక చాలెంజ్ ఉంటుందని బాహుబలి ఫేం దర్శకుడు, ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. కిమ్స్ కడల్స్ ఆధ్వర్యంలో మాదాపూర్లోని హెచ్ఐసీసీలో శనివారం ఏర్పాటు చేసిన ఎన్ఐసీయూ గ్రాడ్యుయేట్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎస్ రాజమౌళి విచ్చేసి కిమ్స్ కడల్స్ దవాఖాన చైర్మన్, డాక్టర్ బొల్లినేని భాస్కరరావుతోపాటు కిమ్స్ కడల్స్ వైద్య సిబ్బందితో కలిసి లిటిల్ వన్స్ క్యూర్ ఫౌండేషన్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ర్యాంప్ వాక్ చేస్తూ చిన్నారులు అలరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్ఐసీయూలో చికిత్స పొంది డిశ్చార్జి అయిన చిన్నారులు వైదికపై ర్యాంప్ వాక్ చేయడం సంతోషకరమని, ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి చిన్నారుల్లో ఉత్సాహాన్ని పెంచిన కిమ్స్ వైద్య బృందానికి ఆయన అభినందనలు తెలిపారు.
కిమ్స్ కడల్స్ దవాఖాన చైర్మన్ బొల్లినేని భాస్కరరావు మాట్లాడుతూ.. పేద తల్లిదండ్రులకు నెలలు నిండకముందే పుట్టిన చిన్నారులు వారికి ఏవైనా సమస్యలు వస్తే లిటిల్ వన్స్ క్యూర్ ఫౌండేషన్ ద్వారా వారికి ఆర్థిక సాయం చేసి పూర్తిస్థాయి చికిత్సలు అందిస్తామని తెలిపారు. నియోనాటాలజీ క్లినికల్ డైరెక్టర్, కిమ్స్ కడల్స్ ఎన్ఐసీయూ విభాగాధిపతి, డాక్టర్ అపర్ణ మాట్లాడుతూ.. ఎన్ఐసీయూలో చికిత్స పొంది సమస్యలను అధిగమించి వచ్చిన చిన్నారులు కార్యక్రమంలో ఉత్సాహంగా అలరించడం సంతోషంగా ఉందన్నారు. నెలలు నిండక ముందే పుట్టిన శిశువులకు ఇవ్వాల్సిన పోషకాహారం, వారి ఎదుగుదల, అభివృద్ధి, వారిలో ఉండే సాధారణ సమస్యల గురించి అవగాహన కల్పించారు.
నెలలు నిండక ముందే జన్మిస్తున్న చిన్నారుల జననాలను తగ్గించడం, అలా పుట్టిన చిన్నారులకు సంరక్షణను మరింతగా పెంచడం అనే లక్ష్యాలకు అనుగుణంగా కిమ్స్ కడల్స్ నిబద్ధతతో ఉందన్నారు. కిమ్స్లో అన్ని విభాగాల్లో నైపుణ్యం కలిగిన వైద్యులు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ కడల్స్, డాక్టర్ శిల్పిరెడ్డితో పాటు చిన్నారులు, తల్లిదండ్రులు ఉన్నారు.