మేడ్చల్, ఫిబ్రవరి 1: కంటి వెలుగు కార్యక్రమం చురకుగా కొనసాగుతున్నది. బుధవారం పెద్ద ఎత్తున ప్రజలుశిబిరాలకు తరలివచ్చి, వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలు, బోడుప్పల్, జవహర్నగర్, పీర్జాదిగూడ కార్పొరేషన్తో పాటు ఏడు మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన 20 శిబిరాల్లో 2333 మంది కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.వారిలో 541 మందికి రీడింగ్ అద్దాలు ఇవ్వగా, 461 మందికి కంటి అద్దాలను ఇచ్చేందుకు చీటి రాసి ఇచ్చారు. కాగా 297 మందికి శస్త్ర చికిత్సల కోసం గుర్తించారు.
పోచారం మున్సిపాలిటీ 5వ వార్డులో ఏర్పాటు చేసిన శిబిరాన్ని అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య ప్రారంభించారు. మేడ్చ ల్ పట్టణ పరిధిలోని అత్వెల్లిలో కంటి వైద్య శిబిరాన్ని వైస్ చైర్మన్ చీర్ల రమేశ్, కౌన్సిలర్ జాకట దేవరాజ్, నాయకులు రవీంద్రెడ్డి, నరేందర్, సందీప్ గౌడ్, మధుకర్ యాదవ్ తదితరులు ప్రారంభించించారు. కీసరలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో మంగతాయారు, సర్పంచ్ మాధురి వెంకటేశ్ సందర్శించారు.