చిక్కడపల్లి : భారత ప్రభుత్వం తటస్థ వైఖరి విడనాడి రష్యా దాడులను ఖండిచాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అన్నారు. తెలంగాణ పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో గురువారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడికి వ్యతిరేకంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ హర గోపాల్ మాట్లాడుతూ యుద్ధాలు మానవ జీవితాన్ని సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేస్తాయని అన్నారు. యుద్ధం వల్ల పౌర హక్కులు విధ్వంసం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా వెంటనే ఉక్రెయిన్ పై యుద్దాన్ని విరమించుకోవాలని, ప్రపంచ శాంతిని కాపాడాలని ఆయన కోరారు.
పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఫ్రొఫెసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ అమెరికాకు చెందిన నాటోపై ఉన్న కోపాన్ని రష్యా ఉక్రెయిన్ పై చూపిస్తుందని తెలిపారు. చిన్న దేశాల మనుడగకు ఇలాంటి పరిమాణామాలు ఆటంకం కలిగిస్తాయన్నారు. భారత ప్రభుత్వం భారతీయులను సురక్షితంగా దేశానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణ రావు, సి.యం రాజు తదితరుల పాల్గొన్నారు.