హయత్నగర్, మే 29: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన హయత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దర్యాప్తుచేపట్టిన పోలీసులకు.. ఈనెల 26న మృతుడు తన ఫోన్ నుంచి ఒక నంబర్కు ఎక్కువ సార్లు మాట్లాడినట్లు తెలిసింది. దీంతో సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. లేక.. హత్యకు గురయ్యాడా.. అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. ములుగు జిల్లా, పంచొట్కులపల్లికి చెందిన ఎల్లావుల పరశురాములు పెద్ద కుమారుడు రాజేశ్ (25) 2021లో ఇబ్రహీంపట్నంలోని శ్రీఇందూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తిచేశాడు.
అప్పటి నుంచి రాజేశ్ తన స్నేహితుడు సాయి ప్రకాశ్తో కలిసి దిల్సుఖ్నగర్లోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. అక్కడే ఉన్నత చదువుల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇదిలా ఉండగా.. పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పాపాయిగూడ చౌరస్తా సమీపంలోని ఓ వెంచర్లో ఒక గుర్తుతెలియని మృతదేహం పడి ఉన్నట్లు సోమవారం స్థానికులు హయత్నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద లభించిన సెల్ఫోన్, పర్సు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా మృతుడు ములుగు జిల్లాకు చెందిన రాజేశ్గా గుర్తించి, అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి క్లూస్ టీమ్ను రప్పించి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
ఈనెల 26న మృతుడు సెల్ఫోన్ నుంచి ఓ నంబర్కు ఎక్కువసార్లు కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే, అదే రోజు ఎల్బీనగర్లోని ఒక ప్రభుత్వ ఉద్యోగిని కూడా ఆత్మహత్యకు పాల్పడటంతో రాజేశ్ కూడా అదే రోజు ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? లేక.. హత్యకు గురయ్యాడా..? అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రెండు మరణాలకు ఏమైనా సంబంధం ఉందా.. అనే కోణంలో రాజేశ్ ఫోన్కాల్స్, ఆత్మహత్యకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగిని ఫోన్కాల్స్ను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. రాజేశ్ మృతికి వివాహేతర సంబంధం ఏమైనా ఉందా..?
అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురిని అనుమానిస్తూ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈనెల 26న ఎల్బీనగర్లోని ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలో రాజేశ్ కూడా మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడా.?, లేక సదరు ఉద్యోగిని కుటుంబ సభ్యులు రాజేశ్ను ఏమైనా బెదిరింపులకు పాల్పడి హత్య చేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.