సిటీబ్యూరో, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం నిర్వహించనున్న విజయయాత్ర నేపథ్యంలో నగరంలో విస్తృతంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. దాదాపు 12 కిలోమీటర్ల మేర సాగనున్న ఈ ప్రధాన యాత్ర ఉదయం 11.30గంటలకు గౌలిగూడ రామ్మందిర్ వద్ద ప్రారంభమై రాత్రి 8 గంటలకు తాడ్బండ్ వీర ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకుంటుంది. భక్తులు భారీగా పాల్గొనే అవకాశం ఉండడంతో నగరంలో అనేక ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా మళ్లించడం ఉంటుందని అధికారులు తెలిపారు.
యాత్ర సాఫీగా సాగేందుకు 3వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నామని, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బలగాలను అందుబాటులో ఉంచుతామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా నేడు కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయం నుంచి ప్రధాన శోభయాత్ర ప్రారంభం కానున్నది. ఈ ర్యాలీ చంపాపేట్, ఐఎస్ సదన్, సైదాబాద్, శంకేశ్వర్బజార్, సరూర్నగర్, కొత్తపేట్, దిల్సుఖ్నగర్ మీదుగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తుందని మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు వెల్లడించారు.