Ibrahimpatnam Cheruvu | సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): చెరువుల పరిరక్షణ, సుందరీకరణే ప్రధాన లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎంతో చరిత్ర ఉన్న ఇబ్రహీంపట్నం చెరువు (పెద్ద చెరువు) కట్ట సుందరీకరణకు శ్రీకారం చుట్టింది.
రూ.9.70కోట్లతో చెరువు కట్ట అభివృద్ధి…
ఇబ్రహీంపట్నం చెరువు (పెద్ద చెరువు)ను 1560లో అప్పటి కులీ కుతుబ్షాల పాలనలో నిర్మించగా, ఇది సుమారు 1300 ఎకరాల విస్తీర్ణంతో ఉంది. ఈ చెరువు అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ సుమారు రూ.9.70 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధ్దం చేసింది. సుమారు 2.9 కి.మీ పొడవు ఉన్న చెరువు కట్టను ట్యాంక్బండ్ తరహాలోఅభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించిన టెండర్లను ఇటీవలే హెచ్ఎండీఏ అధికారులు పిలిచారు. జూలై 3వ తేదీలోగా టెండర్లను సమర్పించాలని కోరింది. టెండరు దక్కించుకున్న సంస్థ ఆరునెలల్లోపు కట్ట అభివృద్ధిని పూర్తి చేయాలన్న లక్ష్యంతో హెచ్ఎండీఏ కార్యాచరణ రూపొందించింది.
చెరువుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి…
ఇప్పటి వరకు ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న చెరువుల సుందరీకరణకు ప్రాధాన్యతనివ్వగా, ఈ ఏడాదిలో ఓఆర్ఆర్ బయట మున్సిపాలిటీల పరిధిలో ఉన్న చెరువులను పరిరక్షణ,సుందరీకణకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఓఆర్ఆర్ బయట ప్రాంతాల్లో పట్టణీకరణ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో జలవనరుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. సుందరీకరణకు నిధుల కొరత సమస్య లేకుండా చేయడంతో పాటు కార్పొరేట్ కంపెనీలకు చెందిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్( సీఎస్ఆర్) నిధులతో చెరువులను సుందరీకరణలో పాలు పంచుకునేలా చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీ, ఇంజినీరింగ్ విభాగం అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు.