సిటీబ్యూరో, డిసెంబరు 1 (నమస్తే తెలంగాణ): కంటివెలుగు రెండో దశ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ వైద్య, ఆరోగ్యశాఖ సన్నద్ధమవుతున్నది. రెండు రోజుల క్రితం కంటి వెలుగు ఏర్పాట్లపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు జరిపిన సమీక్షా సమావేశంలో జారీ చేసిన సూచనల మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వైద్యాధికారులు కంటి వెలుగు వైద్యశిబిరాల ఏర్పాట్లను ముమ్మరం చేశారు. గ్రేటర్ పరిధిలోని ఈ మూడు జిల్లాల పరిధిలో మొత్తం 165 కంటి వెలుగు సెంటర్స్ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని రానున్న జనవరి 18న ప్రారంభించనున్నారు.
గ్రేటర్ వ్యాప్తంగా నిర్వహించనున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమానికి మొత్తం 165 వైద్య బృందాలను సిద్ధం చేసినట్లు గ్రేటర్ వైద్యాధికారులు తెలిపారు. ఒక్కో బృందంలో 8నుంచి 10మంది సిబ్బంది ఉంటారని, అందులో ఒక కంటి వైద్యుడు, ఇద్దరు ఆశాలు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక ఆప్టోమెట్రిస్ట్, ఒక సూపర్వైజర్, ఒక టెక్నీషియన్ ఉంటారని అధికారులు తెలిపారు.
కంటి వెలుగు కార్యక్రమంలో విధులు నిర్వహించేందుకు ఔట్సోర్సింగ్ పద్ధతిన పారామెడికల్ ఆఫ్తాల్మిక్ అధికారులు(ఆప్టోమెట్రిస్ట్లు) నియామకానికి వైద్య, ఆరోగ్యశాఖ గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. అర్హులైన అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని, వారికి నెలకు రూ.30వేల వేతనం చెల్లించినున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి వెల్లడించారు. ఈ నెల 5న ఇంటర్యూలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 7న తాత్కాలిక మెరిట్ జాబితా, 8న అభ్యంతరాల స్వీకరణ, 10న తుది మెరిట్ జాబితా ప్రకటించనున్నట్లు డాక్టర్ వెంకటి వివరాలను వెల్లడించారు.