సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : ప్రజా వైద్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. సుమారు కోటి మంది జనాభా ఉన్న మహానగరంలో ప్రాథమిక వైద్యాన్ని మరింత మెరుగుపరిచే క్రమంలో కొత్తగా డీఎం అండ్ హెచ్ఓ పోస్టులను మంజూరు చేసింది. ఇక నుంచి గ్రేటర్ వ్యాప్తంగా ప్రతి జోన్కు ఒక జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అందుబాటులో ఉంటారు. దీంతో నగరవాసులకు వైద్యసేవలు మరింత చేరువకానున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో మొత్తం 117 ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సుమారు 300 బస్తీ దవాఖానలు సేవలందిస్తున్నాయి. అందులో ఒక్క హైదరాబాద్ నగరంలోనే 92 ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 166 బస్తీ దవాఖానలు సేవలు అందిస్తుండగా, రంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ పరిధిలో 6, మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ పరిధిలో 20 పీహెచ్సీలు, 234బస్తీ దవాఖానలు ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నాయి. కాగా ఒక పక్క నగరం నలువైపులా నాలుగు సూపర్స్పెషాలిటీ దవాఖానలను నిర్మిస్తున్న తెలంగాణ సర్కార్ మరో పక్క జోన్ల వారీగా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను నియమించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దీంతో రోగులకే కాకుండా అర్హులైన వైద్యసిబ్బందికి కూడా పదోన్నతులు, ఉన్నత స్థాయి పోస్టింగ్లు పొందే అవకాశం లభించనున్నది.
కొత్త పోస్టులతో మెరుగైన సేవలు
కొత్త పోస్టులు అందుబాటులోకి వస్తే ప్రాథమిక వైద్యంపై సూక్ష్మ పర్యవేక్షణతో పాటు మరింత మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మినహా మిగిలిన పీహెచ్సీలు గ్రేటర్ పరిధిలో ఉన్నప్పటికీ సంబంధిత జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణలో సేవలందిస్తున్నాయి. అయితే కొత్త పోస్టులు అందుబాటులోకి వస్తే ప్రతి జోన్కు ఒక డీఎం అండ్ హెచ్ఓ అందుబాటులోకి రానున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న జోన్లకు ఆరుగురు అధికారులు అందుబాటులో ఉంటారు. దీంతో ప్రతి చిన్న సమస్యపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టే వీలుంటుంది. ముఖ్యంగా కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలకు సమర్ధవంతంగా మెరుగైన వైద్యం అందించవచ్చు. అంతే కాకుండా మరిన్ని కొత్త బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు తెలంగాణ మినీ డయాగ్నోస్టిటిక్స్ కేంద్రాలు అందుబాటులోకి రానుండటంతో వీటిపై సూక్ష్మ పర్యవేక్షణకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
సర్వత్రా హర్షం
గ్రేటర్ పరిధిలో జోనల్ వారీగా వైద్యాధికారులను ఏర్పాటు చేయడంపై వైద్యసిబ్బందితో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పోస్టులను క్రియేట్ చేయడంతో ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేయడం, వైద్యసేవలను విస్తరించడం వల్ల ప్రజలకు మెరుగైన వైద్యం అందనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన పలు యూనియన్ల నాయకులు చెబుతున్నారు. గ్రేటర్కు ఐదు కొత్త డీఎం అండ్ హెచ్ఓ పోస్టులను మంజూరు చేయడంపట్ల హర్షం వ్యక్తం చేశారు.