మియాపూర్, నవంబర్ 26 : ప్రజల కష్టనష్టాల్లో ప్రభుత్వం ఎల్లవేళలా తోడుగా నిలుస్తున్నదని, వారికి సంపూర్ణ భరోసాను కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ప్రజలను ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా ఆయా డివిజన్లకు చెందిన 43మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి పథకం కింద మంజూరైన రూ. 20,33,000ల ఆర్థిక సాయంతో పాటు, కొండాపూర్ డివిజన్ మార్తాండ్నగర్కు చెందిన లక్ష్మీనారాయణకు రూ. 3 లక్షల ఆర్థిక సాయం మంజూరు పత్రాలను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి విప్ అరెకపూడి గాంధీ శుక్రవారం తన నివాసంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం అహర్నిషలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలకు ఆర్థిక అండగా సీఎం సహాయనిధి పథకం ఎంతగానో ఉపయోగపడుతున్నదని తెలిపారు. కరోనా సహా ఎన్ని విపత్కర పరిస్థితులు నెలకొంటున్నా ప్రజాసంక్షేమం విషయంలో ప్రభుత్వం సమర్థంగా ముందడుగు వేస్తున్నదని విప్ గాంధీ పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు నాయినేని చంద్రకాంత్రావు, దాసరిగోపి, పోతుల రాజేందర్, జంగం పాల్గొన్నారు.