బంజారాహిల్స్, జనవరి 22: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా హైదరాబాద్ వేదికగా ఫిబ్రవరి 26న క్రిసెంట్ క్రికెట్ కప్(సీసీసీ)ని నిర్వహించనున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ హీరోలతో పాటు సింగర్స్, సెలబ్రిటీలు పాల్గొననున్న ఈ క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించిన కప్ను రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బాలీవుడ్ హీరోలు అర్బాజ్ ఖాన్, అప్తాబ్ శివదాసానీ, శాన్వర్ అలీ, టాలీవుడ్ హీరోలు రాజ్ తరుణ్, తారకరత్న, బిగ్బాస్ విన్నర్ రేవంత్, సింగర్ శ్రీరామచంద్ర తదితరులు ఆవిష్కరించారు. ఎల్బీ స్టేడియంలో ఫిబ్రవరి 26న డే అండ్ నైట్ మ్యాచ్ జరుగుతుందని సీసీసీ చైర్మన్ షకీల్షఫీ తెలిపారు. 2011 నుంచి వివిధ సామాజిక అంశాలు థీమ్గా సీసీసీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని, హైదరాబాద్లో రెండోసారి ఈ మ్యాచ్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా యువతలో డ్రగ్స్ మహమ్మారి వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి అవగాహన కల్పించేందుకు క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు.