దుండిగల్, ఫిబ్రవరి 2: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, బాచుపల్లిలోని సిల్వర్ఓక్స్ పాఠశాల విద్యార్థులు మరోసారి తమ గొప్ప మనస్సును చాటుకున్నారు. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీని సేవా కార్యక్రమాలకు వినియోగించారు. ఏకంగా రూ. 24 లక్షల మొత్తాన్ని ఓ రూరల్ డెవలప్ మెంట్ ఫౌండేషన్తో పాటు అనాథ ఆశ్రమానికి విరాళంగా అందజేశారు. సిల్వర్ఓక్స్ విద్యార్థులు 20 ఏండ్లుగా ‘కాయిన్స్ ఫర్ కంట్రీ’ పేరుతో తమ పాకెట్మనీని జమ చేసి..
ఉమ్మడి వరంగల్ జిల్లా కల్లెడలోని రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్(ఆర్డీఎఫ్)కు, అదే సమయంలో ఏపీలోని గుంటూరు జిల్లా నర్సారావుపేటలోని ‘నైస్ అనాథ ఆశ్రమానికి’ కొంతమొత్తాన్ని విరాళంగా అందజేస్తూ వస్తున్నారు. తాజాగా శుక్రవారం సైతం ఆర్డీఎఫ్కు రూ.19 లక్షల 36వేలు, నైస్ అనాథ ఆశ్రమానికి రూ.5 లక్షలను ఆయా సంస్థల ప్రతినిధులకు పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో అందజేశారు. పాఠశాల డైరెక్టర్లు ధనుంజయ, నీలిమ, ఆర్డీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు వందితారావు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.