హైదరాబాద్ : చెరువుల లీజుకు పాత ధరలనే కొనసాగిస్తామని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమన్వయ కమిటీ సమావేశంలో హామీనిచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర ఐక్య కార్యాచరణ సమితి హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఐక్య కార్యచరణ సమితి చైర్మన్ దీటి మల్లయ్య ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సభ్యులు హైదరాబాద్లోని మంత్రి స్వగృహంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఘనంగా సత్కరించి, ధన్యవాదాలు తెలియజేశారు.
అలాగే తమ అభ్యర్థన మేరకు పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోని చెరువుల్లో చేపల పెంపకం, చేపల వేట పై యాజమాన్య హక్కులను మత్స్య శాఖకు బదిలీ చేయడం వల్ల గంగ పుత్రులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, మత్స్య కమిషనర్ కు, సంబంధిత అధికారులకు సమన్వయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కన్వీనర్ కైరంకొండ యాదగిరి, అధికార ప్రతినిధులు పాక మధుసూదన్, ఎల్లా ముత్తన్న, కార్యవర్గ సభ్యులు కాపర్తి మోహన్ కృష్ణ, మెట్టు ధన్ రాజ్ తదితరులు హాజరయ్యారు.