ఖైరతాబాద్, జనవరి 14: రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రపంచపటంలో నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్పై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రైతుబంధు ద్వారా రైతుల ఖాతాల్లో రూ.50 వేల కోట్లు వేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా శుక్రవారం పీపుల్స్ప్లాజా వద్ద పతంగుల పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2012 సంవత్సరానికి ప్రత్యేకత ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 15 రోజుల ముందుగానే సంక్రాంతి ప్రారంభమైందన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టలేదన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయని.. సంక్షేమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏకవచనంతో సంబోధిస్తున్నాడని.. సీఎం కేసీఆర్ తలుచుకుంటే ఆ పార్టీకి ఘోరి కట్టడం ఖాయమన్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి పాలనలో దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు అసంతృప్తితో ఉన్నారని.. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీ ఓడిపోవడం ఖాయమన్నారు. రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే బీజేపీ ఉండదన్నారు. అనంతరం చిన్నారులతో కలిసి పతంగులు ఎగరవేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లక్ష్మీనారాయణమ్మ, టీఆర్ఎస్ ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్, సోమాజిగూడ డివిజన్ ప్రధాన కార్యదర్శి పి.నాగరాజు, నాయకులు గజ్జెల అజయ్, వనం శ్రీనివాస్ యాదవ్, మహేశ్ యాదవ్ పాల్గొన్నారు.