బండ్లగూడ,మార్చి11:గండిపేట మండలం పరిధిలోని పిరం చెరువుపై ఆక్రమణదారుల కన్ను పడింది. ఆక్రమణదారులు రాత్రికి రాత్రి మట్టి కుప్పలు పోసి చదును చేస్తున్నారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో వెలుస్తున్న నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తున్నది. మండల పరిధిలోని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండే పిరం చెరువు విస్తీర్ణం 34 ఎకరాల 29 గుంటలు ఉండేది. కాగా, చెరువుల పరిరక్షణ కోసం నాడు మిషన్ కాకతీయ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల పూడికతీత పనులను చేపట్టారు.
దీంతో పిరం చెరువులో నీరు వచ్చి చేరుతుండేది. చెరువు చుట్టూ పక్షుల కిలకిల రాగాలతో ఉదయం.. సాయంత్రం వేళలో సేద తీరేందుకు వచ్చే ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని పంచేది. గత ఏడాది కాలంలో పిరంచెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇస్తూ ఎఫ్టీఎల్లో నిర్మాణాలకు వత్తాసు పలుకుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని ఆక్రమణదారుల నుంచి కాపాడి భవన నిర్మాణాలు జరగకుండా చూడాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
అడ్డగోలుగా అనుమతులు..
పిరం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలకు అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పత్తాలేని హైడ్రా అధికారులు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములు చెరువులు, కుంటలు, పార్కులు కాపాడుతామని హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో పిరం చెరువు పరిసర ప్రాంతాల్లో అనేక ఆక్రమణలు, నిర్మాణాలు జరుగుతున్నా హైడ్రా తమకు ఏమీ పట్టనట్టుగా ఉంది. గతంలో ఒకసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పిరం చెరువును పరిశీలించి వెళ్లారు. నాడు నిర్మాణాలు తక్కువగా ఉన్నప్పటికీ నేడు పదుల సంఖ్యలో నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఇప్పటికైనా హైడ్రా లాంటి సంస్థలు పట్టించుకొని ఎఫ్టీఎల్ తో పాటు పిరం చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పిరం చెరువును కాపాడాలి..
పిరం చెరువును అక్రమ నిర్మాణాదారులతోపాటు ఆక్రమణదారులపై చర్యలు తీసుకొని కాపాడాలి. గతంలో చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఒకవేళ ఫిర్యాదు చేసిన రెండు రోజులు పని ఆపి మూడో రోజు నుంచి పనులు యధావిధంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని పిరం చెరువులు కాపాడాలి.- బండా నరేశ్ యాదవ్, స్థానికుడు