మెహిదీపట్నం ఫిబ్రవరి 25 : విలాసవంతమైన జీవితాన్ని గడపాలన్న ఉద్దేశంతో పని చేస్తున్న సంస్థకు చెందిన బంగారు, వజ్రాభరణాలతో పారిపోయిన ఓ కారు డ్రైవర్ను ఎస్.ఆర్ నగర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతడి వద్ద ఉన్న చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శనివారం పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ జోయల్ డేవిస్, అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ, పంజాగుట్ట ఏసీపీ ఎస్.మోహన్ కుమార్, ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు, అదనపు ఇన్స్పెక్టర్ పి.వి.రాంప్రసాద్లతో కలిసి వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వెలిసెట్టి శ్రీనివాస్ పోశి(33) నగరానికి వచ్చి ఎస్ఆర్నగర్ మధురానగర్లో ఉంటున్నాడు. రాధికా డైమండ్స్లో కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 17న సుమారు రూ.7 కోట్ల బంగారు, వజ్రాభరణాలను తీసుకొని కారుతో సహా పారిపోయిన విషయం తెలిసిందే.
సీసీలు, సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు..
కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు డ్రైవర్ను పట్టుకోవడానికి పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలోని 150 సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. శ్రీనివాస్ ఆభరణాలు చోరీ చేశాక ఆ కారును కూకట్పల్లి సమీపంలో ఉన్న మెట్రో షాపింగ్మాల్ పార్కింగ్లో వదిలేశాడు. ఆభరణాలను బ్యాగ్లో సర్దుకొని ఆటో ఎక్కి మాదాపూర్లో యజమానురాలు రాధిక ఉండే అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ పార్కింగ్లో ఉన్న తన బైకును తీసుకొని శంషాబాద్ మీదుగా శ్రీశైలం హైవే రూట్లో వెళ్లాడు. యజమానురాలి ఏటీఎం కార్డును ఉపయోగించి కొత్త సెల్ఫోన్, సిమ్ కార్డును కొనుగోలు చేశాడు. ఆ తర్వాత వరంగల్ సమీపంలోని నర్సంపేట్లో ఉన్న తన బంధువు ఇంటికి వెళ్లాడు. చోరీ చేసిన విషయాన్ని దాచి కొత్త ఫోన్, కొత్త సిమ్ను బంధువుకు ఇచ్చి అతడి ఫోన్, సిమ్ కార్డును శ్రీనివాస్ తీసుకున్నాడు. శ్రీనివాస్ కొత్త సిమ్ సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముందుకు సాగించారు. నగరానికి దొంగిలించిన ఆభరణాలను అమ్మడానికి వచ్చిన శ్రీనివాస్ పోశిని శనివారం మధురానగర్లో ఎస్ఆర్నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.