రాష్ర్టానికి గుండెకాయలాంటి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను గత ఏడాది ఆగస్టు 4న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. దీని ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలకు ఉపయోగపడే మల్టీ ఏజెన్సీ టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్గా దేశంలోనే మొదటిసారి ప్రారంభించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): సాంకేతిక సంస్కరణలతో రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నట్లు తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వేలో ప్రభుత్వం పేర్కొన్నది. డ్రగ్ మహమ్మారి కట్టడికి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్న్యూ), నార్కొటిక్ ఇన్విస్టిగేషన్ సూపర్విజన్ వింగ్ (ఎన్ఐఎస్డబ్ల్యూ)ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
సీసీటీవీ సర్వేలెన్స్ సిస్టమ్
హైదరాబాద్లో సీసీ కెమెరాలపై యునైటెడ్ కింగ్డమ్(యూకే) సంస్థ సంస్థ సర్వే చేయడంతో ప్రపంచంలోని అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న 20 ప్రధాన నగరాలలో హైదరాబాద్ 16వ స్థానంలో ఉంది.
హాక్ఐ యాప్
ప్రజలకు, పోలీసులకు మధ్య వారధిగా ఉండేలా హాక్ ఐ యాప్ను డిసెంబర్ 2014లో ప్రారంభించారు. దేశంలోనే అత్యధికంగా ఉపయోగిస్తున్న పోలీస్ యాప్గా హాక్ఐకి గుర్తింపు వచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల యూజర్లు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
బాడీ వార్న్ కెమెరాలు
పోలీసులు ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో బాడీవార్న్ కెమెరాలు అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా ఫ్రెండ్లీ పోలీసింగ్ బలోపేతమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక్కటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ చలాన్ సిస్టమ్ను అమలు చేస్తుందన్నారు.
హెచ్-ట్రీమ్
జీహెచ్ఎంసీ పరిధిలో ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్(హెచ్-ట్రీమ్స్) 213 కూడళ్లలో సిగ్నల్స్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 122 అటోమెటిక్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్(ఏటీఎస్సీ) ఏర్పాటు చేయగా ప్రస్తుతం 111 పనిచేస్తున్నాయని, 98 పాదాచరుల కోసం సిగ్నల్స్ను (పీఎస్ఎస్)ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 78 కేంద్రాలలో ఆన్లైన్లో ట్రాఫిక్ అండ్ కమాండ్ సెంటర్ నుంచే వాటి నిర్వహణ సాగుతుందన్నారు.
వెరీఫాస్ట్
దేశ వ్యాప్తంగా పాస్పోర్టు వెరిఫికేషన్కు సుమారు 21 రోజులు సమయం పడుతుండగా హైదరాబాద్లో మాత్రం నాలుగు రోజులలోపే ఉంటుంది. పాస్పోర్టు వెరిఫికేషన్కు పోలీసలుఉ వెరిఫాస్ట్ యాప్ను ఉపయోగిస్తున్నారు. ఈ యాప్ ద్వారా దరఖాస్తుదారుడికి ఎప్పటికప్పుడు స్టేటస్ తెలుస్తుంది.
మహిళల భద్రతకు షీటీమ్స్
మహిళల భద్రతకు 2014, అక్టోబర్ 24న హైదరాబాద్లో షీ టీమ్స్ను ప్రభుత్వం ప్రారంభించింది. 2022, డిసెంబర్లో ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహిళల భద్రతపై షీ టీమ్స్ పాత్ర గూర్చి వివరించారు.