అల్లాపూర్, జూలై 23 : సీనియర్ సిటిజన్స్ భవన నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అల్లాపూర్ డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా గాయత్రినగర్లో సుమారు రూ.40లక్షల అంచనా వ్యయంతో సీనియర్ సిటిజన్స్ భవనం నిర్మిస్తున్నారు. 300 గజాల్లో నిర్మిస్తున్న భవనం చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో తీర్చిదిద్దుతున్నారు. విశాలమైన భవనం అందుబాటులోకి రానుండటంతో స్థానికంగా ఉన్న సీనియర్ సిటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నెల రోజుల్లో అందుబాటులోకి తెస్తాం..
సీనియర్ సిటిజన్ భవన నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. 300 గజాల స్థలంలో రూ.40 లక్షల వ్యయంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నాం. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం.
– రంజిత్, ఏఈ
ఎమ్మెల్యే, కార్పొరేటర్కు కృతజ్ఞతలు
సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా భవనం లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ కూర్చుంటున్నాం. మా సమస్యను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ సబీహాబేగం దృష్టికి తీసుకెళ్లడంతో వారు సానుకూలంగా స్పందించి నిధులు కేటాయించి పనులు ప్రారంభించడం సంతోషం. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు, కార్పొరేటర్కు కృతజ్ఞతలు.
– డీకే.నాయుడు, గాయత్రినగర్ సినియర్ సిటిజన్