వనస్థలిపురం, మే 12 : నలుగురికి భద్రత కల్పించాల్సిన కానిస్టేబుల్ కట్టుకున్న భార్య పట్ల కాలయముడయ్యాడు. తనకు విడాకులు ఇవ్వడం లేదని కక్షగట్టి కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా దేవరుప్పుల గ్రామానికి చెందిన శోభ(37), సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహుల గూడెంకు చెందిన కుంచం రాజ్కుమార్(38)తో 15సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు సాత్విక్(14), లిఖిత్(11) ఉన్నారు. ఎస్పీఎఫ్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రాజ్కుమార్కు తరచుగా బదిలీలు జరిగేవి.
గత 6సంవత్సరాల నుంచి భార్యతో చిన్నపాటి గొడవలు మొదలై అవి పెద్దవిగా మారాయి. నాలుగేండ్ల కిందట యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో శోభ భర్తపై కేసు పెట్టింది. ఆ తర్వాత కూడా రాజ్కుమార్ తీరు మారలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని హైకోర్టు కాంప్లెక్స్కు బదిలీ అయ్యాడు. వనస్థలిపురం గౌతమినగర్ కాలనీలో నివాసముంటూ విధులు నిర్వహిస్తున్నాడు. కానీ భార్యను వేధించడం మాత్రం మానలేదు. తనకు విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో గురువారం రాజ్కుమార్ ఉన్నతాధికారులను కలిసిన శోభ తనను వేధిస్తున్న తీరును వివరించింది. దీంతో సాయంత్రం డ్యూటీకి వెళ్లిన రాజ్కుమార్ను పిలిచిన అధికారులు ఇంట్లో జరుగుతున్న గొడవలు, శోభ ఫిర్యాదుపై విచారణ జరిపారు. భార్యతో సరిగా ఉండాలని సూచించారు. దీంతో శోభపై కోపం పెంచుకున్న రాజ్కుమార్ రాక్షసుడిలా మారాడు. శుక్రవారం డ్యూటీ నుంచి ఇంటికి వస్తూనే కత్తిని తీసుకుని వచ్చాడు. రాత్రి 9:40 గంటలకు ఇంటికి రావడంతోనే గొడవకు దిగాడు. దాడిచేసి కిందపడేసి కొట్టాడు. దీంతో మొదటి అంతస్తులో ఉన్న శోభ కిందికి దిగి పారిపోయేందుకు యత్నించింది. గేటు సమీపంలోకి రాగానే వెనుకనుంచి జుట్టు పట్టుకుని కత్తితో గొంతు కోసేందుకు యత్నించాడు. పెద్ద కుమారుడు సాత్విక్ అడ్డుకునేందుకు యత్నించగా అతడిపై దాడి చేశాడు. దీంతో రెండు చేతులకు కత్తి గాయాలయ్యాయి. భయపడిన సాత్విక్ పోలీస్ స్టేషన్కు పరుగులు తీశాడు. సాత్విక్ పారిపోవడంతో రాజ్కుమార్ మరింత ఆగ్రహంతో శోభను అదిమి పట్టుకుని గొంతుకోశాడు. దీంతో రక్తం మడుగులో పడిపోయింది. అనంతరం కత్తితో సహా రాజ్కుమార్ పరారయ్యాడు. పోలీస్ స్టేషన్కు వెళ్లిన సాత్విక్ విషయం చెప్పడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్తం మడుగులో ఉన్న శోభను వనస్థలిపురం ఏరియా దవాఖానకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. కుమారుడు సాత్విక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.