ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 28: విద్యార్థుల ప్రయోజనార్థం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల ఖాళీల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు బిల్లును తక్షణమే ఆమోదించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ రాష్ట్ర గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లులో ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఏవైనా మార్పులు సూచిస్తే సైతం చేస్తామని పేర్కొన్నారు. అకారణంగా ఫైల్ పెండింగ్లో పెట్టడంతో వర్సిటీలలో అధ్యాపకులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలు – ఉన్నత విద్యా సవాళ్లు’అనే అంశంపై ఓయూ యూజీసీ డీన్ ప్రొఫెసర్ జి. మల్లేశం నేతృత్వంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కామన్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రభుత్వం ఇప్పటికే అనుమతించిన 1062 అధ్యాపక పోస్ట్లతో పాటు మరో వెయ్యి నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు, డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్, ప్రొఫెసర్ సరస్వతమ్మ, ప్రొఫెసర్ సూర్యాధనంజయ్, డాక్టర్ ఎం. రాధాకృష్ణ పాల్గొన్నారు.