అల్లాపూర్,జూలై2: అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రినగర్ను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోడంతో అభివృద్ధిలో ఆమడదూరంలో ఉండేది. కానీ నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత గాయత్రినగర్లో కోట్లాది రూపాయల నిధులతో ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ సబీహాబేగం పలు అభివృద్ధి పనులు చేపట్టారు. కాలనీలోని అంతర్గత రోడ్లకు రూ.5కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం రూ.3.5కోట్లు వెచ్చించి మెరుగైన మౌలిక వసతులు కల్పించారు. మొత్తంలో గాయత్రినగర్ అతి పెద్ద కాలనీ, ఇక్కడ నాలుగు పార్కులు ఉండగా, గతంలో అవి అభివృద్ధికి నోచుకోక పోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేవి.
కార్పొరేటర్ సబీహాబేగం పార్కులను అభివృద్ధి పరిచేందుకు ఎమ్యెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన రూ.4కోట్లు నిధులు మంజూరు చేశారు. దీంతో రూ.86లక్షలతో ఇండోర్ స్టేడియం నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక మరో పార్కు స్థలంలో రూ.40లక్షల తో చేపట్టిన సీనియర్ సిటిజన్ భవనం నిర్మాణం తుది దశలో ఉందని అధికారులు తెలిపారు. సున్నం పార్కులో ప్రహరీ, ఓపెన్ జిమ్, పిల్లల కోసం ప్రత్యేక ఆట వస్తువులు, బల్లలు ఏర్పాటు చేయడంతో పాటు పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. కాలనీకి ఆనుకొని ఉన్న సున్నం చెరువు కట్ట పై సీసీరోడ్లు, వీధిలైట్లు, బతుకమ్మ, వినాయక నిమజ్జనం కోసం రెండు ఘాట్లను ఏర్పాటు చేశారు.
రూ.5కోట్ల వ్యయంతో సున్నంచెరువు వరదకాలువ నిర్మాణం..
సున్నం చెరువు దిగువ నుంచి మైసమ్మ చెరువు వరకు భారీ వర్షాలు పడిన ప్రతిసారి నాలా పొంగి ప్రవహించేది. దీంతో నాలా పరిసర ప్రాంతమైన గాయత్రినగర్ చంద్రగార్డెన్ సమీపంలో పూర్తిగా ముంపునకు గురయ్యేది. సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక దృష్టిసారించి సున్నం చెరువు దిగువ నుంచి మైసమ్మ చెరువు వరకు నాలా నిర్మాణం చేపట్టి, యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేశారు. రెండు సంవత్సరాలుగా భారీ వర్షాలు కురిసిపనప్పటికీ వరద నీరు నాలా నుంచి పొంగకుండా సాఫీగా వెళ్లి పోతున్నది.
నిధులు కేటాయించి సమస్యలు తీర్చారు
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతనే గాయత్రినగర్ అభివృద్ధికి నోచుకున్నది. డ్రైనేజీ, సీసీరోడ్లు, పార్కుల సుందరీకరణ వంటి పనులు పూర్తిచేశారు. గత ప్రభుత్వాల హయాంలో సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. వర్షాకాలం వచ్చిందంటే చాలు చంద్రాగార్డెన్, ఆంధ్రాబ్యాంకు సమీపంలో వరదనీరు నిలిచి నరకం అనుభవించేవాళ్లం, తొమ్మిది సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ సబీహాబేగం గాయత్రినగర్ పట్ల ప్రత్యేక చొరక చూపి అభివృద్ధి చేశారు. సమస్యలు తీర్చారు.
– సంజీవరెడ్డి గాయత్రినగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు