హైదరాబాద్ అనగానే ఠక్కున గుర్తుకొచ్చేవి చార్మినార్, గోల్కొండ కోట, హుస్సేన్సాగర్. ఈ చారిత్రక సంపదతోపాటు ఐటీ నగరి, ఫార్మా కేంద్రంగా, పర్యాటక ప్రాంతాలకు నెలవుగా ఖ్యాతినార్జిస్తున్నది. నగరంలో పురాతన కట్టడాలకు కొదువ లేదు. ఎన్నో దర్శనీయ ప్రదేశాలు నిత్యం పర్యాటకులతో అలరారుతున్నాయి. మహానగరానికి ముత్యాల హారం తొడిగినట్లు 8 వరుసల్లో విశాలంగా నిర్మించిన ఔటర్రింగ్ రోడ్డు నగర ప్రగతికి దిక్సూచి. ఈ వారధిపై నిర్మించిన 19 ఇంటర్చేంజ్లు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఒక్కో ఇంటర్ చేంజ్ను ఒక్కో రీతిలో చూడచక్కగా తీర్చిదిద్దారు. ప్రగతితోపాటు పచ్చదనానికి ప్రాముఖ్యత ఇస్తూ ల్యాండ్ స్కేప్స్ పేరుతో హెచ్ఎండీఏ ఔటర్ చుట్టూ హరితవనాల్ని ఏర్పాటు చేయడమే కాకుండా పర్యాటకులు సేద తీరేలా అర్బన్ ఫారెస్ట్ పార్క్లను అభివృద్ధి చేసింది. మానవాళికి ఉపయుక్తమైన సూచనలను పెయింటింగ్ రూపంలో రోడ్ల వెంబడి, కూడళ్లలో ఏర్పాటు చేసింది. ఈ బొమ్మలు పలుచోట్ల సెల్ఫీ పాయింట్లుగా మారడం విశేషం.
ప్రతికూడలి..సెల్ఫీ పాయింట్
నగరంలోని రహదారులపై చిత్రకళ చేప్పే సిత్రాలు ఎన్నెన్నో. ఒక్కో ప్రదేశానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను ఒకచిత్రం ద్వారా చెప్పడం ఆర్టిస్టిక్ ఇన్స్టాలేషన్స్ ముఖ్య ఉద్దేశ్యం. అలాంటి చిత్రాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో అందంగా, ఆకట్టుకునే రీతీలో రోడ్ల వెంబడి, కూడళ్లలో వాటిని ఏర్పాటు చేసింది. చిత్రకారులు రూపొందించిన బొమ్మలు నగరంలో సెల్ఫీ పాయింట్లుగా మారాయి. నగర అందాలకు మరింత శోభను తెచ్చేలా వీటి నిర్వహణను హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలు చేపట్టాయి.
దట్టమైన అడవులు..
కాంక్రీట్ జంగిల్గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో సరికొత్త విప్లవానికి తెలంగాణ ప్రభుత్వం బీజం వేసింది. అదే అర్బన్ ఫారెస్ట్ పార్కులు. ఒకేసారి 16 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అందంగా అభివృద్ధి చేసింది. నగరవాసులు కుటుంబ సమేతంగా పచ్చని చెట్ల మధ్య, కాలుష్యం లేని ఆక్సిజన్ను తీసుకునే ప్రాంతాలుగా మార్చారు. ఈ జాబితాలో ప్రధానంగా అంబర్పేట కలాన్ అర్బన్ ఫారెస్ట్ పార్కు, సిరిగిరిపూర్, కమ్మదనం, జలాల్పూర్, బీబీనగర్, పల్లెగడ్డ అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఉన్నాయి.
కళాత్మక వ్యక్తీకరణ..
నగరంలో ఖాళీ ప్రదేశం కళాత్మకతను సంతరించుకుంది. ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ పేరుతో గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు పొడవునా కూడళ్లు, అండర్పాస్లు, ైప్లె ఓవర్ బ్రిడ్జీలను కళాత్మకంగా తీర్చిదిద్దారు. దీంతో దారిన పోయే వారంతా వాటిని చూసి వాహ్ అంటున్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు సందేశ్మాక చిత్రాలను ఔటర్ రింగు రోడ్డు చుట్టూ ఏర్పాటు చేసింది హెచ్ఎండీఏ.
ట్రీ సిటీస్ ఆఫ్ ది వరల్డ్
ట్రీ సిటీస్ ఆఫ్ ది వరల్డ్ టైటిల్ హైదరాబాద్ సొంతం. దేశంలో ఎన్నో నగరాలు ఉండగా, అందులో హైదరాబాద్ ఎంపిక ఎంతో గొప్ప విశేషం. పచ్చని ప్రపంచాన్ని కళ్ల ముందుంచేలా చేసిన కృషికి దగ్గిన ఫలితమే ట్రీ సిటీస్
ఆఫ్ ది వరల్డ్ అవార్డు. ఐక్యరాజ్య సమితి పరిధిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎఈ)అర్బర్
డే ఫౌండేషన్ ఈ అవార్డును అందజేసింది.
నగరం మధ్యలో పచ్చిక బయళ్లు
పచ్చని పచ్చిక బయళ్లు హైదరాబాద్లో అంతర్భాగంగా మారింది. ల్యాండ్ స్కేప్స్ పేరుతో హెచ్ఎండీఏ ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న 19 ఇంటర్చేంజ్ల వల్ల ఏర్పాటు చేసిన పచ్చిక బయళ్లు వాహనదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ల్యాండ్ స్కేపింగ్లో అద్భుతమైన అందాలతో సంజీవయ్య పార్కు, అందులో ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండా ప్రాంగణం ఒక నిదర్శనం. ఇవే కాకుండా ఖైరతాబాద్లోని గ్రీన్ హుక్ పార్క్, మలక్పేట పార్కు, మొండి కుంట లేక్, ఉప్పల్ నాలా, బేగంపేట రెయిన్ గార్డెన్, ట్యాంక్ బండ్, దుర్గం చెరువు, బాలానగర్ ఫ్లై ఓవర్, మేడ్చల్-నాగ్పూర్ జాతీయ రహదారులు నగరంలోనే అత్యంత ఆకర్షణీయమైన ల్యాండ్ స్కేపింగ్ ప్రాంతాలుగా నిలిచాయి.
ఇంటర్ఛేంజ్లు.. ఆహ్లాదానికి చిరునామా..
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు హైదరాబాద్ మహానగరానికే తలమానికంగా మారింది. మారుతున్న కాలంతో పాటు ఓఆర్ఆర్ పరిసరాల రూపురేఖలు మారుతున్నాయి. అందుకు తాజా నిదర్శనం ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న 19 ఇంటర్చేంజ్లు. ఒక్కో ఇంటర్ చేంజ్ రూపం ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చేలా రూపొందించింది హెచ్ఎండీఏ. ఔటర్పై ప్రయాణమంటే ఆహ్లాదానికి కేరాఫ్ అడ్రస్గా మార్చేశారు.
చరిత్ర ఘనం.. ప్రగతి శోభితం
పురాతన కట్టడాలే కాదు.. ఐటీ నగరిగా విశ్వఖ్యాతి హైదరాబాద్ అంటే చార్మినార్.. గోల్కొండ మాత్రమే కాదు.. ఔటర్ రింగు రోడ్డు, ఐటీ కారిడార్ వాటి చుట్టూ అల్లుకున్న అందాలు అన్నీ ఇన్నీ కావు.. ఏడేండ్లలోనే ఎన్నో అద్భుతాలకు నిలయంగా మహానగరం నిలిచింది. ఆ అద్భుతాలను అందరికీ పరిచయం చేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) సరికొత్తగా కాఫీ టేబుల్ బుక్ను తీసుకువచ్చింది. ఇందులో సమాజానికి అవసరమైన, ఎంతో ఇష్టమైన ప్రదేశాలు, చిత్రాలు, సహజ వనరులు సరికొత్త రూపాన్ని సంతరించుకొని మహానగర సిగలో ఆధునిక అభరణాలుగా మారాయి. ఔటర్ రింగు రోడ్డు, ఇంటర్ చేంజ్లు, చెరువులు, అర్బన్ ఫారెస్ట్ బ్లాక్లు, కళాత్మక చిత్రాలు ఇలా పలు అంశాలతో రూపొందించిన పుస్తకాన్ని పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
కె.టి.రామారావు బుధవారంఆవిష్కరించారు.
ఏడేండ్లలో ఎంతెంతో..
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏడేండ్లలో మహానగర ముఖచిత్రం మారిపోయింది. విశాల రహదారులతోపాటు ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా తీర్చేందుకు అనేకానేక ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, ఆర్యూబీలు అందుబాటులోకి వచ్చాయి. ఐటీ నగరి శరవేగంగా విస్తరిస్తుండడంతో లింకు రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఎన్నో అద్భుతాలతో కూడిన నగర అందాలను అందరికీ పరిచయం చేసేందుకు హెచ్ఎండీఏ రూపొందించిన హ్యాండ్బుక్ను బుధవారం పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.