సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ) /ఉప్పల్/అడ్డగుట్ట/ఉస్మానియా యూనివర్సిటీ / మన్సూరాబాద్ : గ్రేటర్లో శనివారం ఉదయం 6.20గంటల నుంచి 8.10గంటల్లోపు చైన్ స్నాచర్లు తెగబడ్డారు. కేవలం 1.50నిమిషాల్లోనే ఆరు చైన్స్నాచింగ్లు చేశారు. ముగ్గులు వేస్తున్న మహిళలు, వాకింగ్కు వెళ్తున్న మహిళలు, ఒంటరిగా ఉన్న మహిళల్ని లక్ష్యంగా చేసుకుని దుండగులు స్నాచింగ్కు పాల్పడినట్లు తెలుస్తోంది. స్నాచింగ్కు పాల్పడింది ఢిల్లీ లేదా యూపీ, రాజస్తాన్ ముఠాల పనే అయివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఫిర్యాదులు అందిన వెంటనే మూడు కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమై వేట మొదలు పెట్టారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి, నిందితుల కోసం గాలిస్తున్నారు. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయం, సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించి 18చోట్ల ఉన్న సీసీ పుటేజీలను సేకరించినట్లు సమాచారం. నిందితులు వినియోగించిన ద్విచక్ర వాహనాలకు నెంబర్ప్లేట్లు లేకపోవడంతో వాహనాలను గుర్తించేందుకు పోలీసులు కసరత్తు మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే వరంగల్, కాజీపేటలో పట్టుబడిన స్నాచింగ్ ముఠాకు శనివారం నగరంలో జరిగిన చైన్స్నాచింగ్లతో సంబంధం లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఢిల్లీ, యూపీకి చెందిన గ్యాంగ్లే స్నాచింగ్లకు పాల్పడి ఉంటాయని అనుమానిస్తున్న పోలీసులు ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపేందుకు సన్నద్ధమవుతున్నారు.
వనస్థలిపురంలో జరిగిన నగదు దోపిడీ, ఉప్పల్లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులను త్వరలో చేదిస్తాం. గ్యాంగు సభ్యులు బయటి రాష్ర్టాల నుంచి వచ్చి రాత్రి వేళల్లో లాడ్జ్లో దిగుతారు. ఉదయం ఓ బైకు దొంగతనం చేసి వరుసగా ఐదు, ఆరు నేరాలకు పాల్పడి పరారవుతారు. వనస్థలిపురం, ఉప్పల్ జరిగిన సంఘటనకు సంబంధించిన కొన్ని క్లూస్ లభించాయి. త్వరలో కేసులను చేదిస్తాం.
– డీఎస్ చౌహాన్, రాచకొండ సీపీ