సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ఎల్బీనగర్, కూకట్పల్లి ప్రాంతంలో ఒకేరోజు రాత్రి వరుస దొంగతనాలకు పాల్పడిన ఘరానా ముఠాను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం బషీర్బాగ్లోని సీసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్) ఏఆర్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. కర్ణాటక, హుబ్లీకి చెందిన దార్ల నీమయ్య అలియాస్ బ్రూస్లీ, అతడి అనుచరుడు మందుల శంకర్ ఫతేనగర్లో ఉంటున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండతోపాటు కర్ణాటకలో బ్రూస్లీపై కేసులు ఉన్నాయి. ఇద్దరూ పలుమార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. గత నవంబర్లో జైలు నుంచి విడుదలైన నిందితులు హైదరాబాద్కు వచ్చి దొంగతనాలు చేయడం ప్రారంభించారు. జనవరి 22, 23వ తేదీ అర్ధరాత్రి ఎల్బీనగర్ పరిధిలో, 24, 25వ తేదీ అర్ధరాత్రి కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు.
వెంటనే సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రఘునాథ్ బృందం రంగంలోకి దిగి, మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా రెండు రోజుల్లోనే 23 దొంగతనాలు చేసినట్లు అంగీకరించారు. అందులో నాలుగు కేసులో ఏపీలో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. దొంగిలించిన సొమ్మును సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన మనో కుమార్ మాలిక్, నామాల శ్రీధర్కు తక్కువ ధరకు విక్రయించారు. దొంగలతో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన రిసీవర్స్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రూ. 20 లక్షల విలువైన 21 తులాల బంగారం, 2.7 కిలోల వెండి, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. దొంగిలించిన సొత్తులో సగానికి పైగా గిల్ట్ నగలే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమావేశంలో టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.