సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ఔటర్ కింద ఆదిబట్ల పోలీసులకు లభించిన గుర్తు తెలియని మృతదేహానికి సంబంధించిన వివరాలు ఐదు రోజులు గడుస్తున్న లభించకపోవడంతో ఈ కేసు మిస్టరీగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన సుమారు 400 మిస్సింగ్ కేసులను పోలీసులు విశ్లేషించారు. గత మంగళవారం ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ కింద చేతులు, కాళ్లు కట్టేసి గోణె సంచిలో మూట కట్టి, కుళ్లిన స్థితిలో ఉన్న ఒక మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.
ఎక్కడో హత్య చేసి.. అక్కడ పడేసి వెళ్లిన హంతకులు పక్కా ప్లాన్తోనే చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓఆర్ఆర్పై సీసీ కెమెరాలకు చిక్కని చోటును హంతకులు ఎంచుకున్నారని పోలీసులు తెలిపారు. మృతుడి వద్ద చిన్న ఆధారం కూడా లభించకుండా నిందితులు జాగ్రత్త పడ్డారు. దీంతో ఈ కేసు చిక్కుముడి వీడటం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే మృతుడు ఎవరనే విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు మిస్టరీని ఛేదించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేఎస్ రావు తెలిపారు.