Crime News | జూబ్లీహిల్స్, ఫిబ్రవరి29: బియ్యం ఒకటే రకం.. బ్రాండ్లు మాత్రం వేర్వేరు.. బ్రాండెడ్ రైస్ పేరుతో వినియోగదారులను నిలువునా మోసం చేస్తున్న వ్యాపార సంస్థ గుట్టును పౌర సరఫరాల అధికారులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మైలార్దేవ్పల్లి టాటానగర్లోని మూల్చంద్ జగన్నాథ్ రైస్ ట్రేడర్స్పై దాడిచేసిన పౌర సరఫరాల శాఖ అధికారులు.. పలు రకాల బ్రాండ్ల పేరిట ప్యాక్ చేసి, మార్కెట్కు తరలించేందుకు సిద్ధంగా ఉన్న బియాన్ని స్వాధీనం చేసుకున్నారు. పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ తెలిపిన వివరాల ప్రకారం..
ఒకే రకమైన బియ్యాన్ని వివిధ బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై మూల్చంద్ జగన్నాథ్ రైస్ ట్రేడర్స్పై దాడులు చేసి, పెద్ద ఎత్తున బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సదరు బియ్యం వ్యాపార సంస్థపై కాపీ రైట్ చట్టం కింద మైలార్దేవ్పల్లి ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సదరు వ్యాపార సంస్థపై కేసు నమోదు చేసి రట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు.