మన్సూరాబాద్, జనవరి 4: శిలా ఫలకం ధ్వంసం చేయడంలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తన ఉనికిని కాపాడుకునేందుకే మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ టంగుటూరి నాగరాజు తెలిపారు. జడ్జెస్కాలనీలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జడ్జెస్కాలనీ సంక్షేమ సంఘం కాల పరిమితి డిసెంబర్ 25న ముగియగా అదే రోజు సాయంత్రం 5 గంటలకు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. సర్వసభ్య సమావేశంలో జడ్జెస్కాలనీ సంక్షేమ సంఘం కార్యవర్గాని రద్దు చేసి దాని స్థానంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కార్యవర్గం రద్దు అయిన నాటికి కాలనీలో ఉన్న షటిల్ కోర్టును ప్రారంభించలేదని తెలిపారు.
జనవరి 2న మధ్యాహ్నం హడావిడిగా రద్దు కాబడిన కార్యవర్గ అధ్యక్షుడితో పాటు ఇతర సభ్యులను చేర్చి షటిల్ కోర్టును డిసెంబర్ 24న కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి ప్రారంభించినట్లు శిలా ఫలకాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. డిసెంబర్ 24న షటిల్ కోర్టును ప్రారంభించినట్లు కార్పొరేటర్ కానీ రద్దు కాబడిన కార్యవర్గం కానీ నిరూపిస్తే తాము ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని తెలిపారు. రద్దు కాబడిన కార్యవర్గంతో జనవరి 2న షటిల్ కోర్టు వద్ద కార్పొరేటర్ ప్రారంభించినట్లు శిలా ఫలకం ఏర్పాటు చేయించడం కాలనీవాసులకు కొందరికి ఇష్టం లేకపోవడంతో శిలా ఫలకాన్ని ధ్వంసం చేసి ఉండవచ్చని తెలిపారు.
శిలా ఫలకం ధ్వంసంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డికి, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కాలనీలో నాలుగు గ్రూపులు ఉన్నాయని ఎవరు షటిల్ కోర్టు వద్ద శిలా ఫలకాన్ని ధ్వంసం చేశారో తెలుసుకోకుండా బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేయడం కార్పొరేటర్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని తెలిపారు. జీహెచ్ఎంసీ నిధులతో ఏర్పాటు చేసిన శిలా ఫలకంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి పేరు ఎందుకు పెట్టలేదో బీజేపీ నాయకులు, మాజీ కాలనీ అధ్యక్షుడు సమాధానం చెప్పాలన్నారు.
మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి కాలనీల అధ్యక్షులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని.. అభివృద్ధి పనుల సమయంలో బీఆర్ఎస్ నాయకులను సన్మానించవద్దని హెచ్చరిస్తున్నాడని తెలిపారు. కార్పొరేటర్ ఇప్పటికైనా ప్రోటోకాల్ పాటించడాన్ని అలవర్చుకోవాలని.. ఒకరిపై ఆరోపణలు చేస్తే రాజకీయంగా ఎదగవచ్చు అనుకుంటే పొరపాటని.. విజ్ఞులైన ప్రజలు ఆయన శైలిని గమనిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి, బాల్రాజ్, శ్రావణ్గౌడ్, దినేశ్, హరి, దాసు తదితరులు పాల్గొన్నారు.