బోడుప్పల్, డిసెంబర్10: బోడుప్పల్ నగరపాలక సంస్థ పాలకవర్గం, అధికారుల సమన్వయలోపం నగరవాసులకు శాపంగా మారింది. అనునిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే బోడుప్పల్-చిలుకానగర్ ప్రధాన రహదారి ఇరుకుగా ఉండడంతో పాటు డివైడర్స్, సిగ్నల్స్ ఏర్పాటు చేయకపోవడంతో ప్రతి నిత్యం ట్రాఫిక్ జామ్ విపరీతంగా పెరిగిపోతుంది.
రూ.50లక్షల నిధులను వీరారెడ్డి చౌరస్తానుంచి చిలుకనగర్ వరకు 60పీట్ల రోడ్డును100ఫీట్ల వరకు విస్తరించాలని కౌన్సిల్లో తీర్మానం చేసి సంవత్సరం గడుస్తున్నా పనులు ముందుకు సాగడంలేదు. కట్టమైసమ్మ వైన్స్ సమీపంలో ఇరుకుగా ఉన్న కల్వర్టును విస్తరించేందుకు మున్సిపల్ నిధులు రూ.50లక్షలు కేటాయించిన ట్రాఫిక్ మళ్లింపు సమస్య పరిష్కరించడంలో అధికారులు విఫలంచెంది కల్వర్టు విస్తరణ పనులు నిలిచిపోయాయి.
దీనితో పాటు ఫుట్పాత్ ఆక్రమణ, అనధికార పార్కింగ్తో రోడ్డు రోజురోజుకు మరింత ఇరుకుగా మారిపోతున్నది. దీంతో అనేక ప్రమాదాలు జరుగడంతో పాటు కొంద రు మృతిచెందిన ఘటనలూ ఉన్నాయి. స్కూల్ బస్సులు, ఉద్యోగుల రాకపోకలతో ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది. కల్వర్టు విస్తరణ చేపట్టకపోవడంతో సరైన సమయానికి ఆఫీసులకు చేరలేకపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కల్వర్టు విస్తరణ చేపట్టాలని కోరుతున్నారు.
త్వరలో పనులు ప్రారంభిస్తాం..
బోడుపల్-చిలుకానగర్ రోడ్డు విస్తరణకు రూ. 50 లక్షలు, కల్వర్టు విస్తరణ పనులకు రూ.50లక్షలనిధులుకేటాయిం చాం. బోడుపల్-చిలుకానగర్ ప్రధాన రోడ్డును 100ఫీట్ల రోడ్డుగా విస్తరి స్తాం. వేలాది వాహనాలను నియంత్రించి దారి మళ్లించడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. దీనిపై అధికారులతో సమీక్షించాం. ట్రాఫిక్ పోలీసుల సహాయం తీసుకుని త్వరలో పనులు ప్రారంభిస్తాం. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేసి నగరవాసులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. ప్రమాదాలను నియంత్రించడానికి డివైడర్స్, సిగ్నల్స్ ఏర్పాటుకు కృషి చేస్తాం. – బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి.