ప్రచారంలో దూసుకుపోతుంటే ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థిని ప్రకటించడానికే మల్లగుల్లాలు పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితా ప్రకటించగా, బీజేపీ ఇంతవరకూ ఉలుకూ పలుకూ లేదు. బీజేపీ లీడర్లు టీడీపీతో పొత్తు కోసం ఉవ్విళ్లూరుతుండగా, క్యాడర్లో తీవ్ర అయోమయం కనిపిస్తున్నది. పొత్తు పొడిస్తే.. ఎవరికి టికెట్కు ఎసరొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆశావహులు టెన్షన్ పడుతూ తమ గాడ్ ఫాదర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆయా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
– సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ) : అభ్యర్థులను ఖరారు చేయడం కాషాయానికి సవాల్గా మారింది. ఓ వైపు అధికార బీఆర్ఎస్ పార్టీ నిత్యం ప్రజల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రచారం చేస్తుంటే.. జనం నుంచి విశేష స్పందన వస్తున్నది. ఇక గులాబీ గెలుపు ఖాయమనే భావనలో బీజేపీ ఉన్నది. అందుకే ఏ అభ్యర్థిని రంగంలోకి దింపాలనే ఆలోచనకు రాలేకపోతున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తు ఉంటుందా? అనే కోణంలోనూ కాషాయ పెద్దలు పునరాలోచనలో పడ్డారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పొత్తు కుదిరితే అభ్యర్థుల ప్రకటనలో పునరాలోచించాల్సి ఉం టుందని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే పొత్తు అంశం కొలిక్కి వచ్చాకనే బీజేపీ అభ్యర్థుల జాబి తా విడుదలయ్యేట్టు కనిపిస్తున్నది. దీం తో ఆశావహుల్లో టెన్షన్ నెలకొన్నది.
అధికార పార్టీ ఇప్పటికే టికెట్లు ఖారారు చేసి ప్రచారంలో దూసుకెళ్తుండగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం గ్రేటర్లో 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కానీ ఇంకా బీజేపీ టికెట్లు ఎవరికీ ఇవ్వాలో కూడా నిర్ణయించుకోకపోవడంతో ఆ పార్టీ నాయకులు అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇటీవల అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ కావడం కూడా పొత్తు అంశంపైనే అని నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో టికెట్ ఖరారులో తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తున్నది. పొత్తు కుదిరితే అటు బీజేపీ.. ఇటు టీడీపీ అనుకున్న స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఉండబోతున్నది. ఇప్పటికే నగరంలోని కుత్బుల్లాపూర్ నుంచి టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పోటీలో ఉండాలని భావిస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున కూన శ్రీశైలం గౌడ్ బరిలో ఉండబోతున్నాడని తెలిసింది. అలాగే సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, శేరిలింగపల్లిలోనూ ఆశావాహులు ఎవరికే వారే ప్రచారం చేసుకుంటున్నారు. పొత్తు కుదిరితే సంబంధిత స్థానాలను ఏదో ఒక్క పార్టీ వదులుకోవాల్సి ఉంటుందని నాయకులు చెబుతున్నారు.
కమలం, టీడీపీ పెద్దలు పొత్తుకు ఉవ్విళ్లూరుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ.. ఆ పార్టీల క్యాడర్ మాత్రం పొత్తును అంగీకరించడంలేదు. ఒంటరిగా బరిలోకి దిగితేనే మేలు జరిగే అవకాశాలు ఉంటాయని ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. అందులో భాగంగానే కమలం పెద్దలు పొత్తుపై తీవ్రంగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల లిస్టును పక్కన పెట్టి మరోసారి సర్వే చేయిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆ సర్వే ఫైనల్ అయ్యాక సీట్లను ఖరారు చేస్తారని, ఇప్పటికే కొత్తవారికి టికెట్లు కేటాయించొద్దంటూ ఆశావహులు అధినాయకత్వానికి లేఖలు రాసినట్టు సమాచారం.