కంటోన్మెంట్, జూలై 28: భారతీయ జనతా పార్టీలో ఆధిపత్య పోరు మరింత తీవ్రమైంది. రోజురోజుకూ ప్రాధాన్యం కోల్పోతున్న బీజేపీకి కంటోన్మెంట్లోనూ సంకట పరిస్థితి ఏర్పడింది. కంటోన్మెంట్ బీజేపీ నేతలు గ్రూపులుగా విడిపోయిన వేళ.. కాషాయ దళంలో కుమ్ములాటలు కామన్గా మారాయి. నోరు తెరిస్తే చాలు అబద్ధాలు వల్లెవేసే నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, ఇతర నేతలపై ఇంటా, బయటా విమర్శల జడివాన కురుస్తున్నది. పలువురు నాయకుల తీరుతో ఇప్పటికే ప్రజల్లో తిరగలేక పోతున్న కమలం నేతలను అంతర్గత కుమ్ములాటలు మరింతగా కుంగదీస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న కీచులాటలతో విసుగు చెందుతున్న అనేక మంది కమలాన్ని వదిలి కారు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బీజేపీలో గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఒంటెత్తు పోకడతో క్యాడర్తో పాటు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎప్పటి నుంచి కంటోన్మెంట్లోని వార్డుల్లో అధ్యక్షులుగా కొనసాగుతున్న సొంత పార్టీ నేతలతో సైతం సఖ్యత కొరవడింది. ఇటీవల కాలంలో ఆరో వార్డు అధ్యక్షుడిగా కొనసాగుతున్న మహేశ్ను కాదని పార్టీ సిద్ధ్దాంతాలను తుంగలో తొక్కుతూ కంటోన్మెంట్ కన్వీనర్గా ఉన్న విజయానంద్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అజయ్ను నియమించడంతో పార్టీలో కుంపట్లు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇదే రీతిలో పలు వార్డులను అధ్యక్షులను మార్చేందుకు కొత్తగా పార్టీలో చేరిన నేతలు ప్రయత్నిస్తుండటంతో విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. సమన్వయం చేయాల్సిన బీజేపీ పెద్దలు పట్టించుకోకపోవడంతో పలువురు సీనియర్ నాయకులు పార్టీని వీడేందుకు సిద్ధ్దమవుతున్నట్లు సమాచారం.
బీజేపీలోని నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, కన్వీనర్ విజయానంద్తో పాటు ఇటీవల కాలంలో బీజేపీలో చేరిన నేతల పనితీరుపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో యువ నాయకత్వం, ఏబీవీపీ, కిందిస్థాయి నాయకులు చురుగ్గా పాల్గొంటుండగా, ముఖ్య నేతలుగా చెప్పుకొంటున్న వారు మాత్రం ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్సీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న జితేందర్రెడ్డి సైతం కంటోన్మెంట్లో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
వెనుకొచ్చిన కొమ్ములు ముందా…. ముందొచ్చిన చెవులు ముందా అంటే బీజేపీ కంటోన్మెంట్లో వెనకొచ్చిన కొమ్ములే ముందు అన్నట్లుగా మారింది. నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణతో పాటు బానుకా నర్మదా మల్లికార్జున్తో సహా పలువురు నేతలు బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల్లో కార్యకలాపాలను నిర్వహించిన నాటి నుంచి బీజేపీతో పాటు కేంద్ర సర్కారును ప్రతిఘటిస్తూ వస్తున్నారు. రామకృష్ణకు బోర్డు ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించిన నాటి నుంచి ఒక్కసారిగా కాషాయ కండువాతో బీజేపీలో ప్రత్యక్షం అయ్యారు. అనుకోకుండా నామినేటెడ్ సభ్యుడిగా కొనసాగుతూ పాత తరం నాయకులను కాదని ఏకపక్షంగా, దూకుడుగా రామకృష్ణ వ్యవహరిస్తుండడం రెండేళ్లుగా కనిపిస్తున్నదే. రామకృష్ణ కోటరీ తీరును నచ్చని బీజేపీ పాత నాయకులంతా ఒక్కటై సందర్భం చిక్కినప్పుడల్లా నేరుగా రామకృష్ణపై దుమ్మెత్తి పోస్తున్నారు.
కంటోన్మెంట్లో ఎమ్మెల్యే ఆశావాహ నేతలుగా ఉన్న పలువురు నేతలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం, తెలంగాణలో తామే ప్రత్యామ్నాయంగా చెప్పుకునే పరిస్థితి లేకపోవడంతో పలువురు ఆశావాహ నేతలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్లో ఇప్పటికే ఎమ్మెల్యే ఆశావాహులు ఎక్కువగా ఉండడంతో మరోవైపు మరికొందరు కాంగ్రెస్ గూటికి చేరుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.