మహేశ్వరం, సెప్టెంబర్ 14 : మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చి దిద్దుతానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం మండల బార్ అసోసియోషన్ సభ్యులు మహేశ్వరంలో కోర్టు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తపరుస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఒక విజన్తో ముందుకు తీసుకుపోతున్నామన్నారు. కొన్ని నెలల కిందటే మహేశ్వరంలో కోర్టు భవనానికి రూ.24కోట్లు కేటాయించామన్నారు. త్వరలోనే టెండర్లను పిలిచి పనులను చేపడుతామని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్న మహేశ్వరం కోర్టు సీనియర్ సివిల్ కోర్టు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహేశ్వరంలో కోర్టు నిర్మాణానికి సహకరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి న్యాయవాదులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియోషన్ అధ్యక్షుడు హరికిషన్గౌడ్, సెక్రటరీ శివకుమార్, కోశాధికారి మురళి, న్యాయవాదులు పూర్ణకుమార్, రాజేశ్, శ్రీకాంత్, భాస్కర్, చంద్రశేఖర్, మల్లేశ్ పాల్గొన్నారు.