సిటీబ్యూరో, సెప్టెంబరు 29 (నమస్తే తెలంగాణ) : చెక్ యువర్ ఓట్పై జీహెచ్ఎంసీ ద్వారా చేసిన అవగాహన ప్రచారానికి విశేష స్పందన వచ్చింది. మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ఓటరు నమోదుపై చెక్ యువర్ ఓట్ అవగాహన కార్యక్రమం ముమ్మరంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా మసీదుల వద్ద చెక్ యువర్ ఓటు పై పోస్టర్లు కరపత్రాల ద్వారా కల్పించిన అవగాహనకు విశేష స్పందన కనబడిందని పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం లక్ష్యం మేరకు గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనం పాండ్స్, మిలాద్ ఉన్ నబీ పండుగను పురసరించుకొని అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టినట్లు చెప్పారు. హైదరాబాద్ జిల్లాలో అర్హులందరినీ ఓటరు నమోదు చేయడం, వారందరు ఓటు వేసే విధంగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఓటరు నమోదుపై ఒక వైపు ఐ వోటు ఫర్ స్యూర్ అనే నినాదంతో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు టీ-షర్ట్ ధరించి ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు.