సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో దశాబ్ది వేడుకలను నేటి నుంచి 22వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జీహెచ్ఎంసీ చేసిన వివిధ పనులు, ప్రాజెక్టుల గురించి విస్తృత ప్రచారం చేయనున్నారు. గతానికి, ఇప్పటికి ఉన్న పరిస్థితులను, జరిగిన అభివృద్ధిని ఫొటోలు సహా ‘నాడు-నేడు’ పేరిట ఫ్లెక్సీల ద్వారా వివరించడంతో పాటు బ్రోచర్లు వేసి పంచాలని అధికారులకు సూచించారు. నగరంలో పెరిగిన మౌలిక వసతుల సదుపాయాల్ని, మెరుగుపడిన పచ్చదనం, పారిశుద్ధ్యం తదితర కార్యక్రమాలను వివరించడంతో పాటు పట్టణాభివృద్ధిలో జాతీయ స్థాయిలో సాధించిన అవార్డుల వివరాలు, డంప్ యార్డులు, ఇలా నగరంలో జరిగిన అన్ని కార్యక్రమాలను భారీ ఎత్తున ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఆయా శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం చేస్తున్నారు.